కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహాడ్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని సారపాక (Sarapaka) ఐటీసీ గేటు సమీపంలో ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను భద్రాచలం దవాఖానకు తరలించారు.
ప్రమాదం సమయంలో కారులో ఏడుగురు ఉన్నారని చెప్పారు. భద్రాద్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.