మేడ్చల్ : మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని కీసరగుట్ట శ్రీ రామలింగశ్వేరస్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం రూ. కోటి నిధులను మంజూరు చేసింది. ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ఈ ఏడాది కీసరగుట్టకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున నిధులను రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు పెంచారు. గత ఏడాది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 3 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఈ సంవత్సరం ఆ సంఖ్య 5 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, సిద్దిపేట జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.
శ్రీ రామలింగేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ సేవలు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. వీఐపీ దర్శనం, అభిషేకం, కల్యాణం కోసం ఆన్లైన్ ద్వారా స్లాట్ బుకింగ్కు భక్తులు వారి అనుకూల సమయంలో చేసుకోనే విధంగా కీసరగుట్ట దేవాలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. స్లాట్ బుక్ చేసుకున్న భక్తుల వాహనాలకు జడ్పీ గెస్ట్హౌజ్ వరకు అనుమతించనున్నారు. వివరాలకు 9701427444 ఫోన్ నంబర్కు సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు రూ. కోటి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందన్నారు. 6 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసేలా అధికారులను ఆదేశించామని తెలిపారు.