హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కంటివెలుగు పరీక్షలు మరో రికార్డుకు చేరువవుతున్నాయి. శుక్రవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 96 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. మరో రెండు రోజుల్లో కోటి మందికి పరీక్షలు పూర్తి కానున్నాయి. కంటివెలుగు వైద్య శిబిరాలను ఈ ఏడాది జనవరి 18న సీఎం కేసీఆర్ మరో ముగ్గురు సీఎంలతో కలిసి ప్రారంభించిన సంగతి తెలిసిందే. 100 రోజుల్లోనే కోటిన్నర మందికి స్క్రీనింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 47 పనిదినాలు పూర్తయ్యాయి. అంచనాలకు మించి సగటున 2 లక్షల మందికిపైగా వైద్య శిబిరాలకు తరలివస్తున్నారు. సగం రోజులు పూర్తికాకముందే 60.55 శాతం మందికి స్క్రీనింగ్ పూర్తి కావడం విశేషం.
సీఎం కేసీఆర్ ఎవరూ అడగకముందే అద్భుతమైన కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనుకున్న లక్ష్యం మేరకు స్క్రీనింగ్ విజయవంతంగా కొనసాగుతున్నది. 47 పనిదినాల్లో 60 శాతం మందికిపైగా కంటి పరీక్షలు పూర్తయ్యాయి. 100 పనిదినాల్లో రాష్ట్రంలో అర్హులందరికీ పరీక్షలు పూర్తి చేస్తాం. కంటి వెలుగు సమయంలో ఇతర వైద్యసేవలకు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వైద్యశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, ఇతర శాఖలు సహా, ప్రజాప్రతినిధులందరూ ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు. పర్యవేక్షణకుగాను రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో క్వాలిటీ కంట్రోల్ బృందాలను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నాం. ప్రతి ఒకరూ కంటివెలుగును సద్వినియోగం చేసుకోవాలి.
– హరీశ్రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి