Rythu Bandhu | వానకాలం రైతుబంధు డబ్బులు వరుసగా నాలుగో రోజు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. జిల్లాలో శుక్రవారం నాలుగు ఎకరాల్లోపు ఉన్న 2,80,104 మంది రైతులకు రూ.203,16,86,527 కోట్లు అందాయి. గత సీజన్లతో పోలిస్తే ఏటా ఈ మొత్తం పెరుగుతున్నది. రైతుబంధు డబ్బులు అందడంతో ఎరువులు, విత్తనాల కోసం ఇతరులపై ఆధారపడే బాధ తప్పిందని రైతులు అంటున్నారు.
సిద్దిపేట, జూన్ 30 : రైతులకు ప్రతి పంటకు ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా అందించే పంట పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. ఇందులో భాగంగా రెండు రోజుల నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. సోమవారం ఎకరంలోపు ఉన్న రైతుల ఖాతాల్లో, మంగళవారం రెండోరోజు రెండెకరాలోపు ఉన్న రైతుల ఖాతాల్లో , బుధవారం మూడెకరాలలోపు ఉన్న రైతుల ఖాతాల్లో, శుక్రవారం నాలుగెకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి డబ్బులను జమ చేసింది.