హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): భారత వైమానిక దళానికి చెందిన కార్గిల్ అమరుడు, సార్జెంట్ పీవీఎన్ఆర్ ప్రసాద్ భార్య అనురాధకు వాయుసేన శౌర్య పతకానికి సంబంధించి నెలవారీ భత్యాన్ని అందించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ డైరెక్టర్ కల్నల్ రమేశ్కుమార్ శుక్రవారం తెలిపారు. 1999 మే 29న కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పాకిస్థాన్తో పోరాడుతూ ప్రసాద్ ప్రాణాలను అర్పించారు. మరణానంతరం ఆయనకు రాష్ట్రపతి ద్వారా వాయుసేన శౌర్య పతకం లభించింది. నాటి వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏవై టిప్నిస్ ఆ అవార్డు గురించి అనురాధకు తెలియజేస్తూ లేఖ పంపారు.
అయితే, ఆమె ఆ శౌర్య పతకం కింద నెలవారీ భత్యాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి వైమానిక దళం నుంచి ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ అందలేదు. దీనికితోడు శౌర్య పతకానికి నెలవారీ భత్యం లభిస్తుందని అనురాధకు తెలియదు. ఆ భత్యాన్ని క్లెయిమ్ చేసుకోవాల్సిందిగా ఎయిర్ఫోర్స్, సైనిక సంక్షేమ శాఖ కూడా ఆమెకు ఎప్పుడూ తెలియజేయలేదు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర సైనిక సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కల్నల్ రమేశ్కుమార్ వైమానిక దళానికి చెందిన గ్యాలంట్రీ అవార్డు విజేతల వివరాలను పరిశీలిస్తున్నప్పుడు సార్జంట్ ప్రసాద్ వివరాలు తెలిశాయి. వెంటనే ఆయన అనురాధను సంప్రదించగా.. వాయుసేన మెడల్కు భత్యం వస్తుందని తనకు తెలియదని ఆమె చెప్పారు. దీంతో కల్నల్ రమేశ్కుమార్ న్యూఢిల్లీ ఎయిర్ఫోర్స్ కార్యాలయానికి ప్రతిపాదన పంపారు. ఫలితంగా 1999 మే 29 నుంచి 2023 జూలై 17 వరకు బకాయిలతో కూడిన భత్యం అనురాధ బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నట్టు కల్నల్ రమేశ్కుమార్ తెలిపారు.