Podu Lands | తమ అస్తిత్వం కోసం గిరిజన, ఆదివాసీలు పోరాడుతూ వచ్చారు. ప్రధానంగా మూడు డిమాండ్ల సాధనకోసమే దశాబ్దాలుగా వారిపోరాటం సాగింది. మావ నాటే మావ రాజ్ (మా తండాలో మా రాజ్యం), రిజర్వేషన్లు, పోడుభూములపై అధికారం.. ఈ మూడింటి కోసం అడవిబిడ్డలు అలుపెరగని పోరు సాగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వారి హక్కుల పరిరక్షణకు, గూడెం-తండా సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ప్రతి తండాను పంచాయతీని చేసి ‘మావ నాటే మావ రాజ్’ కలను సాకారం చేసింది. రిజర్వేషన్లను పెంచి వారి భాగస్వామ్యానికి పెద్దపీట వేసింది. ఇప్పుడు.. జమీన్ పోరాటాలకు ముగింపునిస్తూ పోడు భూములకు పట్టాలు అందజేస్తున్నది. 4లక్షల ఎకరాల పోడు భూములకు నేటినుంచి ప్రభుత్వం పట్టాలను పంపిణీ చేయనున్నది.
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): జల్, జంగల్, జమీన్ అని నినదించిన గోండు వీరుడు కుమ్రంభీం పుట్టిన గడ్డ నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల పట్టాల పంపిణీని శుక్రవారం ప్రారంభించనున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గిరిజనుల ‘పోడు’కల నేటితో నెరవేరనున్నది. దేశచరిత్రలో మొట్టమొదటిసారిగా నాలుగు లక్షల పైచిలుకు ఎకరాల భూమికి అడవి పుత్రులను హక్కుదారులను చేయనున్నారు. పోడు పంపిణీలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తర్వాత తెలంగాణ మూడోస్థానంలో సగర్వంగా నిలువబోతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఫారెస్ట్ రైట్స్ కమిటీలు ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించాయి. 28 జిల్లాలు, 295 మండలాలు, 2,845 గ్రామ పంచాయతీల పరిధిలో ఫారెస్ట్ రైట్స్ కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. 12,49,296 ఎకరాలకు సంబంధించి 4,14,353 క్లెయిమ్స్ను వివిధ స్థాయిలో పరిశీలించి, 28 జిల్లాల పరిధిలో 4,06,369 ఎకరాల భూమిపై 1,51,146 మంది లబ్ధిదారులు పోడు పట్టాలు పొందేందుకు అర్హులుగా గుర్తించారు.
‘భవిష్యత్తులో అటవీ భూమి ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాక్రాంతం కాకూడదు. పోడుభూముల పట్టాల పంపిణీ విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకొంటున్నాం. అటవీ భూమిని ఆక్రమిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న సంకేతాలు పోవాలి’ అని సీఎం కేసీఆర్ ఇటీవల సంబంధిత శాఖలకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని చర్యలు తీసుకొంటున్నారు. ఒకసారి భూ పంపిణీ చేసిన తరువాత అటవీ భూమి ఒక ఇంచు కూడా అన్యాక్రాంతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. పాలిగన్ (POLYGON) టెక్నాలజీ సహాయంతో పోడుభూముల పట్టాల (అటవీ భూ యాజమాన్య హక్కు ప్రతాలు)ను రూపొందించారు. భూమి సర్వే నంబర్, పంపిణీ చేసే భూమి విస్తీర్ణం, ఆ భూమి ఏ అకాంక్ష, రేఖాంశాల మధ్య ఉన్నది? సంబంధిత భూమి హద్దులు ఏవి? వంటి అంశాలను గూగుల్ మ్యాపింగ్ వివరాలతోపాటు హోలోగ్రామ్ను హక్కు పత్రంలో పొందుపరిచారు. దీంతో పంపిణీ చేసిన భూమి విషయంలో ఇరుగుపొరుగువారితో సరిహద్దు వివాదాలు తలెత్తే అవకాశం లేదు. లబ్ధిదారుడి భూమి పక్కనే అటవీ భూమి ఉంటే కాలక్రమేణా సదరు భూమిని లబ్ధిదారుడు ఆక్రమించుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పాలిగన్ టెక్నాలజీని వినియోగించింది.
అటవీ భూ యాజమాన్య హక్కు పత్రాల్లో మూడు శాఖల అధికారులు, లబ్ధిదారుడి సంతకాలను పొందుపరిచారు. హక్కు పత్రాలపై గిరిజన, అటవీ, రెవెన్యూ శాఖల అధికారుల సంతకాలుండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నది. లబ్ధిదారుని ఫొటోను సైతం ఇందులో పొందుపరిచారు. పంపిణీ చేసే పోడు భూములకు ఈ వానకాలం పంట నుంచే రైతుబంధు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య మరో 1,51,146 పెరగనున్నది. 4,06,369 ఎకరాలకు రైతుబంధు కింద ప్రభుత్వంపై ఏటా రూ.406.36 కోట్ల భారం పడనున్నది.
దేశవ్యాప్తంగా అటవీహక్కుల చట్టం అమల్లోకి వచ్చాక (2016) ఏకకాలంలో నాలుగు లక్షల ఎకరాల పైచిలుకు భూములకు పట్టాలు పంపిణీ చేయటం అన్నది చరిత్ర. ఇప్పటివరుకు తెలంగాణలో పంపిణీ చేసింది 3.08 లక్షల ఎకరాలే. మధ్యప్రదేశ్ ఇప్పటి వరకు 9.02 లక్షల ఎకరాలు పంపిణీ చేసి మొదటిస్థానంలో ఉండగా, ఛత్తీస్గఢ్ 8.98 లక్షల ఎకరాలు పంపిణీ చేసి ద్వితీయస్థానంలో ఉన్నది. వీటి తర్వాత తెలంగాణ 4,06,369 ఎకరాలను పంపిణీ చేసి మూడోస్థానంలో నిలవబోతున్నది. మొత్తంగా తెలంగాణ 7.14 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చి మూడోస్థానంలో ఉండటం విశేషం.
నేను పుట్టి పెరిగినప్పటి నుంచి అటవీ సమీపంలోని భూముల్లోనే ఎవుసం చేసుకుంటున్నం. మేము మూడెకరాలు దున్నుకుంటున్నం. ఏటా పంటలు వేసేటప్పుడు ఫారెస్ట్ సార్లు వచ్చి ఇబ్బందులు పెడుతుండ్రు. అడిగితే కేసులు పెడ్తరని భయం. మస్తు తిప్పలైతాంది. సీఎం కేసీఆర్ సార్ మా భూములకు పట్టాలిస్తమని చెప్పిండు. గాయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటడు. 30 తారీఖు నాడు ఇస్తరని చెప్తున్నరు. ఇగ మాకు కూడా పట్టాలస్తయ్. మా బాధలన్నీ పోతయ్.
-సిడాం కన్నీరాం, కొలాంఝరి, ఆసిఫాబాద్ జిల్లా
మా ఊరి శివారులోని నాలుగెకరాల భూమిలో ఎన్నో ఏండ్ల సంది దున్నుకుంటున్నం. ఇప్పుడు సర్కారోళ్లు పట్టాలిస్తే మాకు అన్ని రకాల మేలు జరుగుతది. లోన్లు కూడా వస్తయంటున్నరు. మా బాధలను సీఎం కేసీఆర్ తీరుస్తడని మాకు నమ్మకముంది. పట్టా వస్తే ఇగ మాకు ఢోకా ఉండదు. మంచిగ ఎవుసం చేసుకుంటం.
-మడావి రాధాబాయి, కొలాంఝరి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా
ఇంతకు ముందు మస్తు ప్రభుత్వాలు అచ్చినయ్, పోయినయ్. ఆళ్లు మస్తు మాటలు చెప్పిండ్రు. గవన్నీ గాలికి పోయినయ్. గిప్పుడు గీ సీఎం కేసీఆర్ సార్ చెప్పింది చేసి చూపిస్తున్నడు. సీఎం కేసీఆర్తోటే మాకు పట్టాలు అస్తున్నయ్. గిసుంటి సీఎం మల్లా దొరకడు.
– అనూబాయి, ఇందల్వాయి తండా, నిజామాబాద్ జిల్లా
బతికేతందుకు గీ భూమి తప్ప మాకేం లేదు. దానిలో పంటలేసుకుంటేనే మేం బతికేది. సీఎం కేసీఆర్ సారు మాకు పట్టాలిస్తమని చెప్పిండు. ఇగ ఇప్పటి సంది మా కుటుంబంల సంతోషమే ఉంటది. ఏమి చేసినా సీఎం కేసీఆర్ సార్ రుణం తీరదు.
– జ్యోతిబాయి, రంజిత్నాయక్ తండా, నిజామాబాద్ జిల్లా
అడవుల్లో పోడు చేసుకొని చాలా ఏండ్లయింది. ఇగ పట్టాలు రావనుకున్నాం. భూముల్లో గింజలు వేసినప్పుడల్లా ఫారెస్టు వాళ్లకు, మాకు గొడవలు జరిగేవి. ఎంతో మందికి చెప్పుకున్నం. అయినా పట్టాలు రాలేదు. తెలంగాణ వచ్చాక పట్టాలు వస్తున్నాయి. రైతుబంధు కూడా ఇస్తరంట. చాలా సంతోషంగా ఉన్నది. సీఎం సారు కాళ్లు మొక్కుతాం.
– సర్పా సీతమ్మ, మద్రాస్ తండా, టేకులపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భూముల కోసం ఎన్నో గొడవలు జరిగి నెత్తురు వచ్చేలా కొట్టుకున్నం. అయినా మేము భూములను వదల్లేదు. మేము నరికిన భూమి మాకు కావాలని చెప్తున్నం. అప్పటి అధికారులు చాలా మొండోళ్లు. దెబ్బలు తగిలినా పట్టు వదలలేదు. మేమూ అదే మొండితనంగా ఉన్నం. చివరికి సీఎం సారు మంచి నిర్ణయం తీసుకున్నరు. సీఎం కేసీఆర్ నిజంగా మొనగాడే. గిరిజనులమంతా తెలంగాణ వైపే ఉంటాం.
– ఈసం చిననర్సయ్య, నరసాపురం,
గుండాల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా