హనుమకొండ, మే 26: కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తున్నదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 31న అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న యుద్ధభేరి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యుద్ధభేరి సభ పోస్టర్ను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి అనేక రకాల పథకాలు ప్రారంభించి అమలు చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. లాభాలు తెచ్చిపెడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నదని దుయ్యబట్టారు. గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకాన్ని సైతం దశల వారీగా ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నదని మండిపడ్డారు. యుద్ధభేరి సభకు ముఖ్యఅతిథిగా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, జిల్లా మంత్రులు హాజరవుతారని చీఫ్ విప్ తెలిపారు.