హైదరాబాద్ : ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ (Oscar winner Chandra Bose) కు ఈనెల 28న రవీంద్రభారతిలో అభినందన సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ ( Chairman Juluru Gauri Shankar) ,తెలిపారు. తెలంగాణ సినీ గేయ సాహిత్యానికి విశ్వఖ్యాతిని తెచ్చిన ‘ నాటు నాటు ’ పాటతో సంగీతంలో హుషారెత్తించిన గీతంగా ప్రపంచ ప్రజల అభిమానాన్ని అందుకోవటం తెలంగాణ సమాజం గర్వించతగిందని పేర్కొన్నారు.
సాహిత్య అకాడమీ కార్యాలయంలో చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అధ్యక్షతన చంద్రబోస్ అభినందన సభ సన్నాహక సమావేశాన్ని(Preparatory Meeting)బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొట్టమొదటిసారి తెలుగు గీతానికి ఆస్కార్ అవార్డు(Oscar Award) రావడం ఆనందించాల్సిన విషయమన్నారు. తెలుగు ప్రజలందరూ సంబరపడటానికి కారకుడైన చంద్రబోస్ కు, ఆ పాటకు సంగీతం, నృత్యం, దర్శకత్వం వహించిన వారందరికీ అభినందనలు తెలిపారు.
ఈ సమావేశంలో తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ తెలంగాణ సాహితీ రాష్ట్ర కార్యదర్శి కె ఆనందచారి, తెలంగాణ సాహితీ సహకార దర్శి ఎన్కె సలీమా, అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు సుదర్శన్, కాళోజి అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.