హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని నిర్దేశించింది. 2023-24 సంవత్సరంలో 2.30 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు ప్రణాళికను రూపొందించింది. ఈ మేరకు జిల్లాల వారీగా సాగు ప్రణాళికను అధికారులు రూపొందించగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో సాగుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.750 కోట్లను కేటాయించింది. లక్ష్యం మేరకు అధికారులు కూడా చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో 38 నర్సరీలను ఏర్పాటుచేసిన కంపెనీలు అవసరమైన మొక్కలను పెంచుతున్నాయి. ఆయిల్పామ్ సాగుపై ఆసక్తి గల రైతులు ఆయా జిల్లాల ఉద్యానశాఖ అధికారులను, ఏఈవోలను సంప్రదించాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు.
అత్యధికంగా ఆయిల్ఫెడ్కు 77 వేల ఎకరాలు
ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్ఫెడ్కు ప్రభుత్వం అధిక విస్తీర్ణంలో లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ సంస్థ 8 జిల్లాల్లో 76,900 ఎకరాల్లో ఆయిల్పామ్ను సాగు చేయనున్నది. ఆ తర్వాత ప్రీ యూనిక్ కంపెనీకి ఏడు జిల్లాల్లో 34,800 ఎకరాలను ప్రభుత్వం నిర్దేశించింది. లోహియా కంపెనీకి 27,100 ఎకరాలు, రుచి సోయాకు 24,300 ఎకరాలు, తిరుమల ఆయిల్ కంపెనీకి 14,900 ఎకరాల్లో సాగు లక్ష్యాన్ని కేటాయించింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే కరీంనగర్ జిల్లాలో 18 వేల ఎకరాలు, సిద్దిపేట 17,800, కొత్తగూడెం 16,800, పెద్దపల్లి 14,900, భూపాలపల్లిలో 12,800 ఎకరాలను లక్ష్యంగా నిర్ణయించారు.
కొత్తగా నాలుగు జిల్లాలు
నిరుడి వరకు రాష్ట్రంలో 27 జిల్లాల్లో ఆయిల్పామ్ సాగవగా, కొత్తగా రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలను ఈ జాబితాలో చేర్చారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలను మినహాయిస్తే మొత్తం 31 జిల్లాల్లో ఆయిల్పామ్ సాగుకానున్నది. రంగారెడ్డి జిల్లాలో వాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ కంపెనీ సాగుకు ముందుకు రాగా 5,500 ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించారు. వికారాబాద్ జిల్లాలో హెల్తీ హార్ట్స్ కంపెనీకి 3 వేల ఎకరాలు, మెదక్ జిల్లాలో లివింగ్ కంపెనీకి 5 వేల ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో గోద్రెజ్ కంపెనీకి 5 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగును ప్రభుత్వం నిర్దేశించింది.
ఆయిల్పామ్ సాగులో దేశంలో రెండోస్థానం
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఆయిల్పామ్ సాగులో దేశంలో రెండో స్థానంలో ఉంది. రాష్ట్రం ఏర్పాడే నాటికి రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు కేవలం 36 వేల ఎకరాల్లో మాత్రమే సాగయ్యేది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు ఆయిల్పామ్ సాగు వైపు మళ్లారు. దీంతో ప్రస్తుతం 1.54 లక్షల ఎకరాలకు ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెరిగింది. 2022-23లోనే రికార్డు స్థాయిలో 22,246 మంది రైతులు 82,372 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేశారు.ఈ ఏడాది లక్ష్యం పూర్తయితే రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు 3.84 లక్షలకు చేరనున్నది.