పాలకుర్తి, మార్చి 1 : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో వరి పొలాలు రైతుల కండ్లముందే ఎండుతుంటే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చూసి తట్టుకోలేకపోయారు. తాను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రైతులు, ప్రజల పక్షమేనని మరోసారి నిరూపించారు. మూడు రోజుల క్రితం పాలకుర్తి, దేవరుప్పుల మండలాల్లో పర్యటించిన ఎర్రబెల్లి ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించి చలించిపోయారు. వెంటనే నీటిని విడుదల చేయాలని దేవాదుల సీఈతోపాటు ఇతర అధికారులతో ఫోన్లో పలుమార్లు మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో దేవాదుల 4ఎల్ ద్వారా నీళ్లు వదలకపోతే రైతులతో కలిసి ధర్నా చేస్తానని హెచ్చరించారు. దీంతో దిగివచ్చిన అధికారులు శనివారం దేవాదుల 4ఎల్ ద్వారా గోదావరి జలాలను విడుదల చేశారు. రైతుల బాధలను చూసి గోదావరి జలాలను విడుదల చేసిన దేవాదుల నీటిపారుదల శాఖ అధికారులకు ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు.