మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): వేసవికాలంలో రాష్ట్రంలోని ఏ ఒక్క గ్రామంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని సీఎంవో కార్యదర్శి, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితాసబర్వాల్ అధికారులను ఆదేశించారు. నీటి నాణ్యత, పరిమాణం విషయంలో రాజీపడొద్దని, అధికారులు ప్రతి గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయం నుంచి అన్నిజిల్లాల ఎస్ఈలు, ఈఈలతో ఆమె మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంతో విలువైన నీటిని పొదుపుగా వాడుకొనేలా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. రిజర్వాయర్లలోని నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.