జనగామ :ఈ వానకాలం మొత్తం అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన పలు ప్రాంతాలలో తాజా పరిస్థితులు, పునరావాస చర్యలు, సీజనల్ వ్యాధుల నివారణ వంటి పలు అంశాల పై జనగామ కలెక్టరేట్లో సమీక్షించారు.
ఈ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త వహించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలకు గుర్తించి ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు పంపాలన్నారు. పునరావాస చర్యలు చేపట్టాలని చెప్పారు.
వర్షాల తర్వాత అంటు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలన్నారు. ఈ మేరకు అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలని, ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి అని జిల్లా కలెక్టర్ శివ లింగయ్య ను మంత్రి అదేశించారు. తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.
అనంతరం స్టేషన్ ఘన్ పూర్ మండలం సముద్రాల లో క్షేత్ర పరిశీలన చేసిన మంత్రి ప్రజలతో మాట్లాడి తాజా పరిస్థితులు తెలుసుకున్నారు. ఇప్పగూడెంలో హరితహరంలో భాగంగా ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి మొక్కలు నాటారు.