Medaram | మహబూబాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): మేడారం భక్తులపై అధికారులు ఆంక్షలు విధించారు. బంగారం (బెల్లం) కొనుగోళ్లకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. జాతరలో భక్తులు పెద్ద ఎత్తున బంగారాన్ని అమ్మవార్లు సమ్మక్క, సారలమ్మకు సమర్పిస్తారు. గతంలో ఈ బెల్లాన్ని అక్రమారులు కొనుగోలు చేసి గుడుంబా తయారీకి వినియోగించేవారని, అధికారులు అమ్మకాలపై నిఘా పెట్టేవారు. ఈ ఏడాది ఏకంగా బెల్లం కొనుగోళ్లకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఆంక్షలు విధించారు. బంగారం కొనుగోలు చేసే ప్రతి ఒకరి ఆధార్ కార్డు జిరాక్స్తోపాటు ఫోన్ నంబర్ సేకరించి తమకు అందజేయాలని వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశా రు. కొత్తగా నిబంధనలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనను సడలించాలని వ్యాపారులు, భక్తులు కోరుతున్నారు.