నల్లబెల్లి, మార్చి 1: కంచె చేనుమేసిన చందంగా.. అడవిని రక్షించాల్సిన అధికారే భక్షణకు పూనుకున్నాడు. విచ్చలవిడిగా అడవుల నరికివేతకు స్వస్తి పలకాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతులకు రేపో మాపో పట్టాల పంపిణీకి సిద్ధమవుతుంటే.. మరోవైపు కొందరితో కుమ్మక్కై ఫారెస్ట్ అధికారే అటవీ సంపదను కొల్లగొడుతున్నాడు. ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న ఓ అధికారి అటవీభూమిని పోడుగా మార్చి దానిని రూ.25 లక్షలకు విక్రయించాలని భారీ ప్లాన్ వేశాడు.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గోవిందాపూర్ గ్రామ శివారు ప్రాంతం కొండాపూర్ బీట్ పరిధిలోని ఫారెస్టు భూములను గుర్తించి అధికారులు ట్రెంచ్ కటింగ్కు ఏర్పాట్లు చేశారు. దాని పక్కనే ఓ చిన్నపాటి కాల్వ ఉంది. దీనిని అదునుగా చేసుకొని ఓ అటవీ అధికారి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ఆ భూమిని ఓ రైతు పేరున నమోదు చేసినట్టు తెలిసింది. త్వరలో పోడు రైతులకు సర్వే ఆధారంగా పోడు పట్టాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న క్రమంలో పథకం ప్రకారం ఫారెస్టు భూమిలో ఏర్పాటుచేసిన స్ట్రెంచ్ను జేసీబీలతో ధ్వంసం చేసి కొందరు వ్యక్తులు సుమారు మూడెకరాల్లో అటవి భూమిని పోడు చేశారు. ఈ భూమి మొత్తాన్ని పక్కా ప్లాన్ ప్రకారం రూ.25 లక్షలకు భూ ఆక్రమణదారులు అమ్మకానికి పెట్టినట్టు మండలంలో చర్చ జరుగుతున్నది.