హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : టీఎస్పీఎస్సీ ఈ నెల 16న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం బీఆర్కేభవన్లో టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్రెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డితో కలిసి ఆయన జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,019 పరీక్ష కేంద్రాల్లో 3.8 లక్షల మంది అభ్యర్థులు గ్రూప్-1 ప్రిలిమినరీకి హాజరవుతున్నారని తెలిపారు. పోలీస్ శాఖ సమన్వయంతో స్ట్రాంగ్రూమ్ వద్ద తగిన రక్షణ ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, పారిశుధ్యం తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. స్ట్రాంగ్రూం ఇంచార్జ్లు, రూట్ ఆఫీసర్లు, లైజన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు టీఎస్పీఎస్సీ సూచనలకు కట్టుబడి ఉండాలని చెప్పారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్రూమ్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం1 గంట వరకు పరీక్ష ఉంటున్నదని వెల్లడించారు. అభ్యర్థులు తమ హాల్టికెట్లను https://www.tspsc.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. తొలిసారిగా ప్రవేశ పెట్టిన బయోమెట్రిక్ ఫీచర్పై అభ్యర్థులకు అవగాహన కలిగించడానికి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.