AP Bhavan | హైదరాబాద్, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ): ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన పూర్తయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మొత్తం ఆస్తిలో ఏపీకి 58.32%, తెలంగాణకు 41.68% చెందే విధంగా రెండు రాష్ర్టాలు పరస్పరం ఆంగీకరించి కేంద్రానికి తమ సమ్మతిని తెలియజేశాయి. దీంతో కేంద్ర హోంశాఖ దీనికి ఆమోదముద్ర వేస్తూ గెజిట్ను విడుదల చేయడమే తరువాయి అని అధికారవర్గాలు తెలిపాయి. అయితే, రాష్ర్టానికి నష్టం చేకూర్చే ప్రతిపాదనకు ప్రభుత్వం సమ్మతించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలోని ఏపీ భవన్ సుమారు 19 ఎకరాలకుపైగా విస్తరించి ఉండగా, దీని విలువ రూ.7,110 కోట్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఇందులో ఏపీకి 58.32%, తెలంగాణకు 41.68% చొప్పున ఆస్తులను పంపిణీ చేయాల్సి ఉన్నది. ఈ లెక్కన ఏపీకి సుమారు 11 ఎకరాలు, తెలంగాణకు సుమారు 8 ఎకరాలకుపైగా భూమి రావాల్సి ఉంటుంది. విభజనలో భాగంగా ఢిల్లీ అశోకా రోడ్డులోని చారిత్రక హైదరాబాద్ హౌస్ను ఆనుకొని ఉన్న మూడు ఎకరాల్లోని శబరి, స్వర్ణముఖి బ్లాక్ల్లో వాటాతోపాటు అందులోని 5.24 ఎకరాల స్థలాన్ని తెలంగాణకు కేటాయించినట్టు తెలిసింది.
ఇది ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న 41.68 శాతానికి సమానం కావడంతో ఏపీ సైతం ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదన తెలంగాణకు నష్టమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి హైదరాబాద్ హౌస్తోపాటు ఇక్కడి మొత్తం స్థలం తెలంగాణకే చెందుతుందని, కేంద్రం హైదరాబాద్ హౌస్ను తీసుకొని దానికి ప్రత్యామ్నాయంగా ఈ ఐదు ఎకరాల ఖాళీ స్థలాన్ని కేటాయించిందని అధికారవర్గాలు చెప్తున్నాయి. అయితే, పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 41.68% కింద హైదరాబాద్ హౌస్కు ఆనుకొని ఉన్న మొత్తం స్థలాన్ని తెలంగాణకే కేటాయించి ఏపీకి మరోచోట స్థలం కేటాయించాలని గతంలో తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీనికి అటు కేంద్రంతోపాటు ఏపీ ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో గత కొంతకాలంగా ఈ వ్యవహారం నానుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ హౌస్ను ఆనుకొని ఉన్న మూడు ఎకరాల్లోని శబరి, స్వర్ణముఖి బ్లాక్ల్లో వాటాతోపాటు అందులోని 5.24 ఎకరాల స్థలం తీసుకునేందుకు అంగీకరించినట్టు, దీనికి ఏపీ కూడా సానుకూలంగా స్పందించడంతో ఇరు రాష్ర్టాల అధికారులు విభజనకు సంబంధించి ఒప్పందాన్ని కేంద్రానికి సమర్పించినట్టు అధికారులు తెలిపారు.
ఏపీ భవన్ విభజన పూర్తైన వెంటనే అక్కడ నూతనంగా తెలంగాణభవన్ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితోపాటు అధికారులు తెలంగాణభవన్ ఉన్న ప్రాంగణాన్ని పరిశీలించి నూతన భనవం నిర్మాణంపై చర్చించారు. శబరి, స్వర్ణముఖి బ్లాక్లు పురాతనమైనవి కావడంతో వాటిని తొలగించి నిర్మించాలా? లేక 5.24 ఎకరాల ఖాళీ జాగాలో నూతన భవనం నిర్మించాలా? అనే అంశంపై అధికారులు సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకంటే శబరి, స్వర్ణముఖి బ్లాక్ల్లో ఏపీకి కూడా వాటా ఉండటంతో వాటి తొలగింపు సాధ్యమవుతుందా? లేదా? అనేది అర్థంకావడంలేదని అధికారులు తెలిపారు. తెలంగాణభవన్ తెలంగాణ సంస్కృతీ-సంప్రదాయా లు ప్రతిబింబించే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టంచేయడంతో అదే విధంగా నిర్మించాలని నిర్ణయించారు.