కరీంనగర్ : ప్రభుత్వ అధికారులు ఆధిపత్యంతో కాకుండా మానవతా దృక్పథంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాచకొండ కమిషనరేట్ జాయింట్ కమిషనర్ గా బదిలీపై వెళుతున్న వి సత్యనారాయణకు వీడ్కోలు, నూతన సీపీగా బాధ్యతలు చేపట్టిన ఎల్.సుబ్బారాయుడుకు స్వాగతం పలుకుతూ శుక్రవారం కరీంనగర్లో ఆత్మీయసమ్మెళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సామాన్య మానవునికి న్యాయం జరగాలని తెలిపారు. ప్రజలకు సేవలందించడమే ప్రథమ కర్తవ్యంగా అధికారులు పనిచేయాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇష్టమైన జిల్లా కరీంనగర్ పేరును చరిత్రలో నిలిచేలా అధికారులు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. బదిలీపై వెళ్లిన వారికి గౌరవంగా వీడ్కోలు పలకడం,కొత్తగా వచ్చిన వారికి స్వాగతం పలకడం మంచి సంప్రదాయమని అన్నారు.
సీపీగా అన్ని వర్గాల మన్ననలు పొందిన కొద్ది మందిలో సత్యనారాయణ ఒకరని కొనియాడారు. కరీంనగర్ లో పని చేసిన అనుభవం ఉన్న అధికారులు క్వాలిటీ గా పని చేస్తారనే పేరు ఉందని, ఆ నమ్మకాన్ని నిజం చేయాలని అన్నారు. మొదటి సారి కరోనా కేసులు కరీంనగర్ లో నమోదు కావడంతో దేశం అంత కరీంనగర్ వైపు చూశారని అన్నారు. ఆ సమయంలో పోలీసుల సహకారం మరువలేనిదని మంత్రి పేర్కొన్నారు.