హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, జాతీయ నేత గిరిధర్ గమాంగ్ శుక్రవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతిభవన్లో జరిగిన ఈ భేటీలో గిరిధర్ గమాంగ్ కుమారుడు శిశిర్ గమాంగ్ తదితరులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా దేశంలోని వర్తమాన రాజకీయ పరిణామాలపై వారు సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత సీఎం కేసీఆర్తో కలిసి అడుగులు వేసేందుకు అనేక రాష్ర్టాల నుంచి పార్టీలు, నేతలు తమ సంసిద్ధతను వ్యక్తంచేస్తున్న తరుణంలో గిరిధర్ గమాంగ్ ఆయనతో భేటీ కావడంపై ఆసక్తి నెలకొన్నది. రాష్ర్టాలపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, వర్తమాన రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించినట్టు తెలిసింది.
ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, పినరాయి విజయన్, భగవంత్మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సహా పలువురు నేతలు హాజరుకానున్నారు. ఈ సభ భారత రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ జాతీయ ఎజెండాను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెల్లడించి అందుకు తగిన భవిష్యత్ కార్యాచరణను ఈనెల 18న నిర్వహించనున్న ఖమ్మం సభలో ప్రకటించే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత గిరిధర్ గమాంగ్ సీఎం కేసీఆర్తో భేటీ కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. దశాబ్దాల కాలంపాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి, 2015లో బీజేపీలో చేరిన గిరిధర్ గమాంగ్ కేసీఆర్తో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
9 పర్యాయాలు పార్లమెంటుకు ఎన్నిక
ఒడిశా రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ గిరిధర్ గమాంగ్కు ప్రత్యేకత ఉన్నది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గమాంగ్ సొంతరాష్ట్రం నుంచి 9 పర్యాయాలు పార్లమెంట్కు ఎన్నికయ్యారు. 1972 నుంచి 2004 దాకా వరుసగా కోరాపుట్, లక్ష్మీపూర్ స్థానాల నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్ 6 వరకు సుమారు 10 నెలలపాటు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహారశైలి నచ్చక 2015లో ఆయన బీజేపీలో చేరారు. కాగా, గిరిధర్ సతీమణి హేమ గమాంగ్ 1999లో ఎంపీగా వ్యవహరించారు.
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్కు మొక్కను అందించి స్వాగతం పలుకుతున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు. చిత్రంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి, గిరిధర్ గమాంగ్ కుమారుడు శిశిర్ గమాంగ్ తదితరులు