CM KCR | హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్న నేపథ్యంలో భారీగా పండుతున్న వరిని ఫుడ్ప్రాసెసింగ్ ద్వారా మార్కెటింగ్ చేసే మార్గాలను అన్వేషిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో వరి ధాన్యం దిగుబడి ఏటా 4 కోట్ల టన్నులకు చేరుకొంటుందని, అంత భారీ పంటను భిన్న రూపాల్లో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్కు సరఫరా చేస్తేనే రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు. పంటల తీరు, ఫుడ్ప్రాసెసింగ్ పరిశ్రమ తదితర అంశాలపై సీఎం కేసీఆర్ శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యవసాయ విధానంలో భాగంగా ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెస్) పరిశ్రమలను స్థాపించాలని నిర్ణయించామని తెలిపారు. మిల్లింగ్ కెపాసిటీని పెంచేందుకు మరిన్ని అధునాతన రైస్ మిల్లులను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తూ దేశంలో నంబర్వన్ స్థాయికి చేరుకొన్నదని వెల్లడించారు.
అందుబాటులోకి వచ్చిన గౌరవెల్లి, మలపేట, బస్వాపూర్ తదితర ప్రాజెక్టులుసహా మరి కొద్దిరోజుల్లో పూర్తికానున్నపాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో వరిధాన్యం దిగుబడి మరో కోటి టన్నులకు పెరిగి 4 కోట్ల టన్నులకు చేరుకొనే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిల్వ ఉన్న 1.10 కోట్ల టన్నుల వరిధాన్యం, 4 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకోకుండా ఎఫ్సీఐ రకరకాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నదని విమర్శించారు. పరిస్థితి ఇలాగే ఉంటే వరి పంటను పలు రకాల ఆహార ఉత్పత్తులుగా మార్చి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేసి, రైతుకు మరింత లాభం వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రైస్ మిల్లుల మిల్లింగ్ సామర్థ్యం కోటి టన్నులు మాత్రమేనని, మరో రెండు కోట్ల టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసే సామర్థ్యం మేరకు మిల్లులను ఏర్పాటు చేయాల్సి ఉన్నదని పేర్కొన్నారు. అదనంగా పండుతున్న ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేయడానికి అధునాతన రైస్ మిల్లులను ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రైతు సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యం
‘పంటకు పెట్టుబడి అందించడం నుంచి ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించి కొనేదాకా దేశంలో మరే రాష్ట్రం చేపట్టని విధంగా తెలంగాణలో రైతు సంక్షేమ చర్యలు చేపట్టామని సీఎం కేసీఆర్ అన్నారు. ‘ఇవ్వాళ తెలంగాణ పచ్చబడ్డది. పంట దిగుబడి విపరీతంగా పెరిగింది. రైతు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. ఇంకా వారి సంక్షేమం కోసం ఫుడ్ ప్రాసెస్ యూనిట్లను ఏర్పాటుచేసి ధాన్యం ఉత్పత్తులు ఎగుమతయ్యేలా చూడాలి. అప్పడు తెలంగాణ వరికి గిరాకీ పెరిగి రైతు లాభాలు గడిస్తారు. అదనంగా పండే పంటను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నూతనంగా అధునాతన మిల్లులు ఏర్పాటు చేయబోతున్నాం. ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసి విధి విధానాలు ఖరారు చేసి కార్యాచరణ ప్రారంభించనున్నాం. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సటాకె’ వంటి కంపెనీలతో చర్చించినం. వారితో రేపటి నుంచే కమిటీ చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలి’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని పునరుద్ఘాటించారు.సమీక్షా సమావేశంలో మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సబితా ఇంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు దామోదర్రావు, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సీఎంవో అధికారులు నర్సింగ్రావు, సటాకే’ ఇండియా డైరెక్టర్ ఆర్కే బజాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ విధివిధానాల రూపకల్పనకు కమిటీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ విధి విధానాల ఖరారు కోసం కమిటీని సీఎం కేసీఆర్ ఏర్పాటుచేశారు. ఆర్థిక శాఖప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షుడిగా, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐటీ పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్కుమార్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి సభ్యులుగా కొనసాగుతారని సీఎం తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్ష్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం సర్వదా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వర్షాలపై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. గోదావరిలో వరద, భద్రాచలం వద్ద ముంపు పరిస్థితిపై ఆరా తీశారు. కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల్లో చేరుతున్న వరద గురించి అధికారులను అడిగి తెలుసుకొన్నారు. వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని సీఎస్ శాంతికుమారి తెలిపారు. శనివారం, ఆదివారం కూడా భారీ వర్షాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
కేసీఆర్కు దివ్యాంగుల ధన్యవాదాలు: వాసుదేవరెడ్డి
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): పింఛన్ రూ.4,116కు పెంచిన సీఎం కేసీఆర్కు దివ్యాంగులు రుణపడి ఉంటారని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు సంబంధించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దివ్యాంగులకు గృహలక్ష్మి పథకంలో 5 శాతం రిజర్వేషన్, బధిరులకు ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటు, పథకాలకు ప్రత్యేక బడ్జెట్, రోస్టర్ పాయింట్ల తగ్గింపు అంశాలను పరిశీలించాలని కోరారు.