హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 3,03,56,894కు చేరింది. రాష్ట్రం మొత్తం మీద మహిళల కంటే పురుష ఓటర్ల సంఖ్య 1,57,789 ఎక్కువగా నమోదైంది. పురుష ఓటర్లు 1,52,56,474 మంది ఉండగా మహిళా ఓటర్లు 1,50,98,685 మంది ఉన్నారు. 2021 జనవరితో పోల్చుకొంటే 2022 జనవరి నాటికి కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య దాదాపు 2.84 లక్షలకు పైగా ఉన్నప్పటికీ, 92,934 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి
తొలగించారు. దీంతో నికరంగా పెరిగిన ఓటర్ల సంఖ్య 1,91,325కు పరిమితమైంది. ఈ ఏడాది కాలంలో 18-19 ఏండ్ల వయస్సున్న 1,36,496 మంది యువ ఓటర్లు కొత్తగా జాబితాలో చేరారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని ఓటర్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ బుధవారం వెల్లడించారు. ఎన్నికల కమిషన్ ఏటా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపడుతున్నది. కొత్త ఓటర్ల నమోదు, చిరునామాల మార్పు, చనిపోయినవారి పేర్ల తొలగింపు ప్రక్రియను నిర్వహిస్తున్నది. గత ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు వివిధ దశల్లో నిర్వహించిన ఓటర్ల సవరణ కార్యక్రమం అనంతరం ఎన్నికల అధికారులు తుది ఓటర్ల జాబితాను విడుదలచేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 22 జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున ఎన్నికల ఓటింగ్ మిషన్లు, వీవీ ప్యాట్లను భద్రపర్చేందుకు గోదాముల నిర్మాణం చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఇందులో 20 జిల్లాల్లో నిర్మాణం పూర్తి కాగా, రూ.11.58 కోట్లు వ్యయం అయినట్టు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రం మొత్తం మీద హైదరాబాద్ జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానంలో, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తృతీయ స్థానంలో నిలిచాయి. అత్యల్ప ఓటర్లున్న చివరి మూడు జిల్లాల్లో ములుగు, వనపర్తి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు ఉన్నాయి. 18-19 ఏండ్ల యువ ఓటర్లున్న జిల్లాల్లో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉండగా, రంగారెడ్డి రెండో స్థానంలో, మేడ్చల్ మల్కాజిగిరి మూడో స్థానంలో నిలిచాయి. వనపర్తి జిల్లాల్లో అత్యల్ప సంఖ్యలో యువ క్యాటగిరీ ఓటర్లున్నారు. ట్రాన్స్జెండర్ల ఓటర్లలో రంగారెడ్డి ప్రథమ స్థానంలో ఉండగా, మేడ్చల్ మల్కాజిగిరి రెండో స్థానంలో, హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచాయి.