KCR | విశాల దృక్పథం, బహుళ ప్రయోజనాలు, జాతీయ భావాలనే ముద్దు మాటల ముసుగులో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం చేసేందుకు మరోసారి రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పుడు మనకో రక్షకుడు కావాలి. దక్షిణాది రాష్ర్టాలకు జరుగుతున్న మోసాన్ని బహిర్గతం చేసేందుకు బలమైన అధినాయకుడు కావాలి. ఢిల్లీ పాలకుల్ని సవాల్ చేస్తున్న కేసీఆర్ దేశ రాజకీయాల్లో దక్షిణాది ఆశాకిరణం. అభివృద్ధిలో
తెలంగాణను పంజాబ్, హర్యానా సరసన నిలిపిన ఘనమైన పాలకుడు మళ్లీ గెలవాలి. లోక్సభ స్థానాల సంఖ్య పెంపులో దక్షిణాదికి ప్రాధాన్యత ఉండాలంటే, కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపుల్లో దక్షిణాదికి, చిన్న రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించాలంటే, ఢిల్లీ పాలకుల్ని నిలదీయాలంటే కేసీఆర్ లాంటి లీడర్ కావాలి.
వచ్చే పదేళ్లలో.. జనాభా లెక్కల తర్వాత లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను పెంచుతారు. ఇదే జరిగితే దక్షిణాది రాష్ర్టాలకు లోక్సభలో ఉత్తరాది రాష్ర్టాల ప్రాతినిధ్యం పెరుగుతుందని కార్నిజి ఓ నివేదికలో పేర్కొన్నది. ఇది ఆందోళన కలిగించే ప్రమాదం. మన వాణిని బలంగా వినిపించి, దక్షిణాదికి న్యాయం జరగాలంటే కేసీఆర్ రాజకీయాలకు మనం మద్దతుగా నిలవాలి. ఆయనే నేటి దక్షిణాదికి ఆశాకిరణంలా ఉన్నారు. దక్షిణాది రాష్ర్టాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ అనేక కారణాల వల్ల తమిళనాడుకు పరిమితమవుతున్నాడు. దేశ రాజకీయాల్లో వామపక్షాలు బలహీనంగా ఉన్నాయి. కాబట్టి కేరళ ఢిల్లీని గెలిచే అవకాశమే లేదు.
ఆంధ్రప్రదేశ్ నేతలకు ఆ ఆశలే లేవు. అన్యాయం జరుగుతుందన్న ఆవేశమూ లేదు. ఇక.. కర్ణాటకలో చూస్తే, జాతీయ పార్టీల మధ్యనే అధికార మార్పిడి జరుగుతున్నది. ఢిల్లీ తానా అంటే బెంగళూరు తందానా అంటుంది. మన వాణిని వినిపించే, మన హక్కుల్ని రక్షించే వాళ్లెవరైనా ఉన్నారా? అంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్కరే కనిపిస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలువాలన్నట్టు రెండు పర్యాయాలు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణను ఆర్థిక, సామాజిక ప్రగతిలో అగ్రస్థానంలో నిలబెట్టారు. ఇది కేసీఆర్ చెప్పుకుంటున్నది కాదు. కేంద్ర ప్రభుత్వమే చెప్పిన ప్రోగ్రెస్ అది. దేశంలో ఆర్థిక ప్రగతికి మరో పేరుగా చెప్పుకునే పంజాబ్, హర్యానా రాష్ర్టాల సరసన తెలంగాణ చేరింది. ఆ వేగంతోనే కేసీఆర్ దేశాన్ని బాగు చేయాలని దేశ రాజకీయాల్లోకి విస్తరించాలనుకున్నారు.
తెలంగాణ ప్రజలు మరోసారి దీవించాలి. తెలంగాణ శాసన సభకు జరుగుతున్న ఎన్నికల్లో పోటీపడే రెండు జాతీయ పార్టీలకు చెందిన నేతలు ఢిల్లీ తాయిలాలకు ఆశపడి తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెడతారు. వాళ్లను నమ్మితే..ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలే పునరావృతమవుతాయి. మరుగుజ్జు నాయకత్వాలను తరిమికొట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. కరువుకు తావులేకుండా సమృద్ధిగా పంటలు పండిస్తున్న రైతులు ఆలోచించాలి. కేసీఆర్ను, బీఆర్ఎస్ నాయకత్వాన్ని పటిష్టం చేయడం ద్వారా దక్షిణాది రాష్ర్టాలను ఢిల్లీ కుట్రల నుంచి కాపాడుకునే గురుతర బాధ్యత తెలంగాణలోని విజ్ఞులైన ఓటర్లపైనే ఉన్నది. కేసీఆర్కు మూడో సారి పట్టం కట్టి తెలంగాణ మాడల్కు జై కొట్టాలి. దేశ రాజకీయాల్లో మార్పునకు శ్రీకారం చుట్టాలి.
–కేవీఎస్ ఇంద్ర