మన ఊరు-మన బడికి 25 లక్షల విరాళం
ఏపీ ఎన్నారై కృష్ణకాంత్కు మంత్రి కేటీఆర్ అభినందన
హైదరాబాద్, ఫిబ్రవరి 12 : ఆదరించి అక్కున చేర్చుకున్న హైదరాబాద్ నగరం రుణం తీర్చుకునేందుకు ఏపీకి చెందిన ఎన్నారైలు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సర్కారు ఇటీవల ప్రారంభించిన మనఊరు-మనబడి కార్యక్రమానికి ఎన్నారైల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఈ కార్యక్రమానికి తాజాగా ఏపీకి చెందిన ఎన్నారైలు నుంచి భూరి విరాళాలు ప్రకటించి నగరంపై, తెలంగాణపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. హైదరాబాద్ నగరం తనకు ఎంతో ఇచ్చిందని, హైదరాబాద్కు ఎంతోకొంత ఇవ్వాలని నిర్ణయించుకున్నానని విజయవాడకు చెందిన ఎన్నారై నిమ్మగడ్డ కృష్ణకాంత్ పేర్కొన్నారు. మన ఊరు-మన బడి పథకానికి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. కృష్ణకాంత్ను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐతో ‘నమస్తే’ ముచ్చటించగా పలు విషయాలను పంచుకున్నారు.
కుటుంబ నేపథ్యం..
నేను పుట్టింది, పెరిగింది విజయవాడ. నాన్న నిమ్మగడ్డ హనుమంతరావు. అమ్మ ఇందిర. నా విద్యాభ్యాసం విజయవాడతో పాటుగా వైజాగ్లోనూ కొనసాగింది. నాగార్జున యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందా. ఆ తరువాత అమెరికాలోని నార్త్వెస్ట్రన్ యూనివర్సిటీ కెల్లాగ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నా. మొదటిసారి ఉద్యోగం కోసం హైదరాబాద్లో అడుగుపెట్టా. చాలాకాలం పాటు నగరంలోని ఒక ప్రముఖ కంపెనీలో పనిచేశా. 17 ఏండ్ల క్రితం యూఎస్కు వచ్చేశా.
హైదరాబాద్తో అనుబంధం..
ఉద్యోగ రీత్యానే కాదు హైదరాబాద్తో విడదీయలేని అనుబంధముంది. నా మొదటి స్టార్టప్ కంపెనీని 2013లో హైదరాబాద్లోనే ప్రారంభించా. దానిని ఇంటెల్ కొనుగోలు చేసింది. 2018లోనూ ఇక్కడే రెండో స్టార్టప్ కంపెనీని ప్రారంభించగా దానిని యాక్సెంచర్ టేకోవర్ చేసింది. మొత్తంగా నా వ్యాపార జీవితంలో ఉన్నతస్థానానికి చేరుకున్నాను అంటే అది హైదరాబాద్ వల్లే.
మనఊరు-మనబడి కార్యక్రమంపై..
హైదరాబాద్ నగరం నాకు ఎంతో ఇచ్చింది. తిరిగి నగరానికి ఏదైనా చేయాలని ఎప్పటినుంచో మనసులో అనుకుంటున్నా. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మనఊరు-మనబడి అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే జీవితంలో ఎవరైనా ఉన్నతస్థానాలకు చేరుకోవాలంటే ప్రాథమిక విద్యనే కీలకం. వెంటనే ఆ కార్యక్రమానికి రూ.25 లక్షల విరాళాన్ని ఇచ్చా. ఇంత గొప్పకార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
విరాళంతో ఏం చేయనున్నారు..
విరాళాన్ని ఇచ్చిన అనంతరం మంత్రి కేటీఆర్తో మాట్లాడాను. నా ఆకాంక్ష మేరకు హైదరాబాద్లోని ఏదైనా ఒక ప్రైమరీ స్కూల్ అభివృద్ధికి నేను ఇచ్చిన మొత్తాన్ని వెచ్చిస్తామని చెప్పారు. నా శక్తి మేరకు భవిష్యత్లో సాయం అందిస్తా.