మిర్యాలగూడ రూరల్, జనవరి 29 : ఉన్నత చదువుల కోసం 2015లో అమెరికా వెళ్లిన నూర్బాషా కమల్హసన్.. అక్కడే స్థిరపడి 2020లో బంగ్లాదేశ్కు చెందిన యువతి నూజాత్ ఫాతిమాను పెండ్లి చేసుకున్నాడు. ఏడేండ్ల తరువాత తల్లిదండ్రుల దగ్గరికి వస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భార్యతో కలిసి విమానం దిగాడు. అక్కడి నుంచి కారులో ఇంటికి బయలుదేరాడు. మరో రెండు గంటల్లో ఇంటికి వస్తారని తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే అతడిని మృత్యువు వెంటాడింది. వారు ప్రయాణిస్తున్న కారు మార్గమధ్యంలో ప్రమాదానికి గురై పల్టీకొట్టి ఎన్ఆర్ఐ దుర్మరణం చెందాడు. కొడుకు, కోడలును చూసి ఆనందించాల్సిన తల్లిదండ్రులు కొడుకు మరణ వార్తతో బోరున విలపించారు. ఆనందంతో నిండాల్సిన ఆ ఇల్లు విషాదంలో మునిగిపోయింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అద్దంకి-నార్కట్పల్లి జాతీయ రహదారిపై గూడూరు వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.