NREGA | హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కార్మికుల వేతనాల పెంపు లో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగింది. ప్రతిసారి జరుగుతున్న అన్యాయాన్ని ఈ సారైనా సరిచేస్తారని ఆశించినా నిరాశే ఎదురైంది. రోజువారీ వేతనం గరిష్ఠ మొత్తాన్ని ప్రతి ఏడాది మార్చిలో కేంద్రం ఖరారు చేస్తుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఎన్నికల సంఘం అనుమతితో గురువారం సవరించింది. వివిధ రాష్ర్టాలలో 4 నుంచి 10 శాతం వరకు వేతనాల్ని పెంచుతున్నట్టు ప్రకటించింది. తెలంగాణలో రోజు కూలీని రూ. 300గా ఖరారు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.272 గా ఉంది. దక్షిణాది రాష్ర్టాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే ఉపాధి హామీ కార్మికులకు తక్కువ వేతనం అందనుంది. కాగా, పెంచిన వేతనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రోజూవారీ పనికి వెళ్లే ఏ కార్మికుడికైనా తక్కువలో తక్కువగా రూ.700కు పైగా లభిస్తున్నది. ఉపాధి హామీ కార్మికులకు రూ.300 మాత్రమే ఇస్తామని కేంద్రం చెబుతున్నది. రోజంతా పని చేసినా రూ.300 కూడా రాకపోవడంతో కూలీలు ఉపాధి హామీ పని చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. పైగా ఇచ్చే అరకొర వేతనం కూడా సమయానికి రావడం లేదు. మూడునాలుగు నెలలకు ఒకసారి వేతనాలు వస్తుండటంతో కార్మికులు ఉపాధి హామీ వైపు చూడడం మానేశారు. వేరే ఏ పనీ దొరక్కపోతేనే ఇటువైపు వస్తున్నారు. ఫలితంగా కూలీల సంఖ్యతో పాటు పని దినాలు కూడా తగ్గుతున్నాయి.