హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): గౌరవెల్లి ప్రాజెక్టు సైట్ పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా వెంటనే పునరుద్ధరించాలని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) సూచించింది. తక్షణమే సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు చేపట్టాలని, లేదంటే ఆదేశాలను ఉల్లంఘించినట్టు ఎన్జీటీ పరిగణిస్తుందని హెచ్చరించింది.
ఈ మేరకు బుధవారం ప్రత్యేకంగా తెలంగాణ సర్కారుకు లేఖ రాసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ సైట్ మొత్తాన్ని పర్యవేక్షించేందుకు ఏడు సీసీ కెమెరాలను అమర్చారు. వాటి డాటాను నిరంతరం జీఆర్ఎంబీకి అందిస్తూ వస్తున్నారు. జీఆర్ఎంబీ అధికారులు సైతం సైట్ను పలుమార్లు సందర్శించారు. ఇన్స్టాల్ చేసిన కెమెరాల్లో లోపాలున్నాయని, వాటిని సరిదిద్దాలని ప్రాజెక్టు అధికారులకు సూచించారు. కొన్ని నెలలుగా చాలా కెమెరాల నుంచి డాటా రావడం ఆగిపోయిందని, సీసీ కెమెరాల్లోని జీఎస్ఎం నెట్వర్క్ సిమ్కార్డుల గడువు ముగిసిందని తెలిపింది.