Dasoju Sravan | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఫ్యాక్షన్ భాష మాట్లాడుతున్నాడని విమర్శించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బుధవారం నాడు దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి భస్మాసురుడిలా మారాడని అన్నారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఫినిష్ చేసిందే రేవంత్ రెడ్డి అని అన్నారు. టీడీపీలో చాలామంది సీనియర్ నాయకులను ఫినిష్ చేశారని.. ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీని ఫినిష్ చేశాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కేసీఆర్ను ఫినిష్ చేస్తానని అంటున్నాడని మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రే వాళ్లను ఫినిష్ చేస్తా.. వీళ్లను ఫినిష్ చేస్తానని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ వ్యతిరేక వాదులు కూడా కేసీఆర్ను ఫినిష్ చేస్తానని అనలేదని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డికి ఇంకా ఫ్యాక్షన్ బుద్ధులు పోలేదని దాసోజు శ్రవణ్ అన్నారు. రేవంత్ రెడ్డి కాదు.. పెయింటర్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. నువ్వు ఆంధ్రా నాయకుల బూట్లు మోస్తున్నప్పుడే కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడుతున్నాడని గుర్తుచేశారు. తెలంగాణ ప్రదాతపై దుర్మార్గమైన భాష మాట్లాడటం సిగ్గు చేటు అని విమర్శించారు. దమ్ముంటే కేసీఆర్తో రాజకీయంగా కొట్లాడాలని సవాలు విసిరారు.
అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానించిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. నువ్వు కూర్చుంటున్న సెక్రటేరియట్ కట్టింది కేసీఆర్.. నువ్వు తిరుగుతున్న రోడ్లు.. తాగుతున్న నీళ్లు కేసీఆర్ శ్రమ అని అన్నారు. దేశంలోనే తెలంగాణ నంబర్వన్ అయ్యిందంటే అది కేసీఆర్ కృషి అని తెలిపారు. మూసీ పక్కన రాజీవ్ గాంధీ విగ్రహం పెడతానని అంటున్నావ్.. మరి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను ఎందుకు తిడుతున్నావని మండిపడ్డారు. అసలు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.