మా పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు.. రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. తెలంగాణలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు.
– ఉత్తమ్
Uttam Kumar Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ): ‘మా పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు..’ రాష్ట్ర సాగు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వ్యాఖ్యలివి. శనివారం గాంధీభవన్లో మీడియా సమావేశం సందర్భంగా రైతు ఆత్మహత్యలపై ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా మంత్రి పైవిధంగా స్పందించారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారంటూ నల్లగొండ పర్యటనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారని విలేకరి ప్రశ్నించగా, మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ ‘రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. తెలంగాణలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు’ అని జవాబిచ్చారు. అయితే,
ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేసిన రోజే ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతానికి చెందిన మహేందర్ (35), మహబూబ్నగర్ జిల్లా మద్దిగట్లకు చెందిన కురువ శ్రీశైలం (30) ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజుకు సగటున ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డట్టు ఆరోపణలున్నాయి. కాగా, ఉత్తమ్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు తెలిపిన రైతు సంఘాల నేతలే మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత గల పదవిలో ఉంటూ అబద్ధాలు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ‘ఉత్తమ్గారూ.. రైతుల ఆత్మహత్యలపై అబద్ధాలు చెప్పకండి. మేం చేసిన సర్వేలో 64 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. ఈ చనిపోయిన రైతులంతా రైతులు కాదంటారా? రైతులపై అబద్ధాలు మానేయండి’ అని మండిపడ్డారు. వాట్సాప్లో స్టేటస్ పెట్టుకొని, ఉత్తమ్ వ్యాఖ్యలతో పాటు ఆత్మహత్య చేసుకున్న రైతుల జాబితాను పోస్ట్ చేశారు.
రైతులు తనువు చాలిస్తుంటే ప్రభుత్వం మాత్రం వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఓవైపు కరువు, మరోవైపు ప్రభుత్వం నుంచి భరోసా దక్కకపోవటంతో అభద్రతాభావానికి లోనై తనువు చాలిస్తున్నారు. ఇప్పటికే కరువుతో పంటలు ఎండుతున్నాయి.. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో అప్పులపాలవుతున్నారు. బతికి ఉంటే అప్పుల తిప్పలు తప్ప మరేం ఉండదని ఆందోళన చెంది రైతులు చావే శరణ్యమని అనుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలపై చలించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇటీవల నల్లగొండ పర్యటనలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వ, అసమర్థ పాలనే కారణమని దుయ్యబట్టారు. ఆ మరుసటి రోజే కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల జాబితాను ప్రభుత్వానికి అందిస్తే, వారి కుటుంబాలను పరామర్శించి, వారిని సచివాలయానికి పిలిచి పరిహారం అందిస్తామని అన్నారు. సీఎం అడిగిన 4 గంటల్లోనే ఆత్మహత్య చేసుకున్న 209 మంది రైతుల జాబితాను ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ అందించింది. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు ఊరు, పేరు, ఎప్పడు? ఏ కారణంతో చనిపోయారు? అన్న పూర్తి వివరాలతో జాబితాను అందించింది. తీరా జాబితా అందించాక సీఎం రేవంత్రెడ్డి మౌనం వహించారు. రైతుల ఆత్మహత్యలపై గానీ, జాబితాపైగానీ, పరిహారంపై గానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం గమనార్హం.
సాగు నీటి కొరత కారణంగా ఇప్పటికే సుమారు 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్టు అంచనాలు ఉన్నాయి. పంట నష్టాలు, చేసిన అప్పు, పెట్టుబడి తిరిగి రాకపోవటం తదితర కారణాలతో సుమారు రూ.3 వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలిసింది. రైతులు అప్పులపాలవుతున్నా, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏ మాత్రం సాయం అంది నా రైతులు ఆత్మహత్యలు చేసుకునే వారు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.