వర్గల్/హైదరాబాద్, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ): కిరాయి చెల్లించలేదని ప్రభుత్వ పాఠశాలకు భవన యజమాని తాళం వేసిన ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జెబ్బాపూర్లో శనివారం చోటుచేసుకున్నది. శాశ్వత భవనం లేక తమకు ఈ దుస్థితి ఏర్పడిందని, వెంటనే భవన నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కారు. దీనిపై మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందిస్తూ సర్కార్ తీరును ఎండగట్టారు. వివరాలు ఇలా.. జెబ్బాపూర్లో గత వర్షాకాలంలో ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. దాన్ని నేలమట్టం చేసి కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్త భవనం అందుబాటులోకి వచ్చే వరకు ఓ ఇంటిని కిరాయికి తీసుకొని తరగతులు నిర్వహిస్తున్నారు.కిరాయిని స్థానికులు కొందరు చెల్లిస్తామని ముందుకు వచ్చారు. రెండు నెలల కిరాయి చెల్లించారు. కాంట్రాక్టర్ కొత్త స్కూల్ భవనం పనుల విషయంలో నిర్లక్ష్యం చేయడంతో పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. నాలుగు నెలలుగా ఇంటి యజమానికి కిరాయి చెల్లించకపోవడంతో శనివారం పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సమావేశంలో స్కూల్ భవనం విషయమై చర్చ కాస్త వాడివేడిగా సాగింది. ఈ క్రమంలో కిరాయి చెల్లించడం లేదంటూ యజమాని తాళం వేశారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సర్పంచ్ వెంకట్ గ్రామస్థులతో మాట్లాడి స్కూల్ భవనం పూర్తయ్యేవరకు తానే కిరాయి చెల్లిస్తానని హామీ ఇచ్చారు.
కిరాయి చెల్లించకపోవడంతో బడికి తాళం వేయగా గేటు బయట విద్యార్థులు పాఠాలు వినాల్సిన దుస్థితి నెలకొనడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. వర్గల్ మండలం జబ్బా పూర్లో ప్రభుత్వం కిరాయి చెల్లించకపోవడంతో ప్రైమరీ స్కూల్కు యజమాని తాళం వేయగా విద్యార్థులు ఆరుబయట కూర్చున్న చిత్రాన్ని ఎక్స్లో పోస్ట్కు ట్యాగ్ చేసి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ స్కూళ్ల దుస్థితిని ఎండగట్టారు. తరగతి గదుల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన చిన్నారులు రోడ్డు మీదకు వచ్చి నినదిస్తుంటే కాంగ్రెస్ సర్కార్కు చీమకుట్టినట్టు కూడా లేకపోవడం సిగ్గుచేటని హాట్ కామెంట్స్ చేశారు. ‘విద్యాశాఖ నిర్వాహణ మరెవరితో కాదని, తన వద్దే అట్టిపెట్టుకున్నట్టు చెప్పే సీఎం రేవంత్ ఈ ఘటన చూసి సిగ్గుపడాలన్నారు.