హైదరాబాద్ : నేతన్నలకు వ్యతిరేకంగా పని చేసే ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పండి అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. టీ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.. నేతన్నల కుటుంబాల నుంచి ఒక్క ఓటు కూడా బీజేపీ అభ్యర్థికి వేయకండి. తగిన శిక్ష విధించండి. మోదీకి తెలిసే విధంగా తీర్పు ఇవ్వండి. బీజేపీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు చేయండి. నేతన్నల ఆగ్రహాన్ని ఆ పార్టీ చవి చూస్తే.. అప్పుడు దిగివచ్చి వెంటనే సవరించుకునే అవకాశం ఉంటది.
అన్ని వేదికలపై నేతన్నల తరపున తప్పకుండా రాజీలేకుండా పోరాడుతాం. వందకు వంద శాతం మోదీ ప్రభుత్వం ఉండబోయేది ఒక సంవత్సరం మాత్రమే. ఆ తర్వాత నాన్ బీజేపీ గవర్నమెంట్ ప్రభుత్వం వస్తదని విశ్వసిస్తున్నాను. తప్పకుండా అందులో మన పార్టీది కూడా క్రియాశీలక పాత్ర ఉంటదని విశ్వసిస్తున్నాను. ఆనాడు తప్పకుండా దీన్ని రివర్స్ చేయించే బాధ్యత తప్పకుండా తీసుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు.
కిషన్ రెడ్డికి అవగాహన లేదు. ఆయన జ్ఞానం ఎలాంటిది అంటే. కరోనా వ్యాక్సిన్ను మోదీ కనుగొన్నారు అని చెప్పారు. కొత్తగా 8 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారని చెప్పారు. తెలంగాణ గ్లోబల్ సెంటర్ ఫర్ మెడిసిన్ ను ఇచ్చామని చెప్పారు. ఈ మూడు ఆయన అన్నారు. కానీ తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదు. కిషన్ రెడ్డి నేను అనలేదని రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తాను.
ఇలాంటి వ్యక్తులు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించడం మన దురదృష్టం. అమిత్ షా, మోదీని పొగడడమే వారికి తెలుసు. కానీ తెలంగాణకు రావాల్సిన హక్కుల గురించి స్థానిక బీజేపీ నేతలు మాట్లాడరని కేటీఆర్ ధ్వజమెత్తారు.