నందికొండ, మే 7 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రైతు బంధుగా ఉంటే ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి రైతుల పాలిట రాబందుగా తయారయ్యాడని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వరంగల్ సభలో చేసిన రైతు డిక్లరేషన్కు నాలుగు సంవత్సరాలు నిండటంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ గురువారం సాగర్ పైలాన్ కాలనీలోని శివాలయ పుష్కరఘాట్ వద్దకు రైతులతో వెళ్లి రైతు డిక్లరేషన్కు పిండ ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో రైతులు పంటలు పండించి బంగారం కొనుక్కునేవారు, కాంగ్రెస్ హయాంలో బంగారం అమ్మి పంటలు పండించే దుస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. పెట్టుబడి సహాయం, నీళ్లు అందక, కరెంట్ లేక, యూరియా దొరక్క పంటకు మద్దతు ధర లభించక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.