MLC Nominations | మెదక్- నిజామాబాద్-కరీంనగర్- ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తొలి రోజే తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో గ్రాడ్యుయేట్ స్థానానికి ఆరుగురు, టీచర్ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో ఇద్దరు అభ్యర్థులు గ్రాడ్యుయేట్, టీచర్స్ స్థానానికి రెండిట్లోనూ నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 13 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఛాంబర్లో నామినేషన్లు స్వీకరించారు.
అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ తర్వాత కలెక్టర్- ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి మీడియాతో మాట్లాడుతూ గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తాను రిటర్నింగ్ అధికారిగా, వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ నెల 3 నుండి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 8, 9 తేదీల్లో ప్రభుత్వ సెలవులు ఉండడం వల్ల నామినేషన్లు స్వీకరణ జరగదని, ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఈనెల 11న నామినేషన్ల పరిశీలన,13 న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. మార్చి 3 న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు.
నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సందేహాలను నివృత్తి చేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హెల్ప్ డేస్క్ ఏర్పాటు చేశామని చెప్పారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి తూ.చ తప్పకుండా పాటించాలని ,ర్యాలీలు, సమావేశాలు, సభలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని కోరారు.
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి కరీంనగర్ జిల్లా జమ్మికుంట వాసి సిలివేరు శ్రీకాంత్ అనే అభ్యర్థి.. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు రెండు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన దూడ మహిపాల్, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడెంకు చెందిన గవ్వల లక్ష్మి, మేడ్చల్ కు చెందిన కంటే సాయన్న గ్రాడ్యుయేట్ స్థానానికి ఒక్కో సెట్ నామినేషన్ వేశారు. హైదరాబాద్ వాసి చాలిక చంద్రశేఖర్ గ్రాడ్యుయేట్ స్థానానికి రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా వాసి మంచికట్ల ఆశమ్మ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి కూర రఘోతంరెడ్డి, చాలిక చంద్రశేఖర్ ఒక్కొక్క సెట్ నామినేషన్, సిలివేరు శ్రీకాంత్ రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు డిఆర్ఓ వెంకటేశ్వర్లు, పవన్ కుమార్ ఆర్డిఓ కే మహేశ్వర్, తహసిల్దార్లు పాల్గొన్నారు.