Telangana | కరీంనగర్, మార్చి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో కరువుఛాయలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ పాలనలో కాళేశ్వరం జలాలను రాజరాజేశ్వర రిజర్వాయర్ (మధ్యమానేరు) ద్వారా అన్నపూర్ణ రిజర్వాయర్కు ఎత్తిపోసేది. ఈ రిజర్వాయర్లో ఓవర్ ఫ్లో అయిన నీరు పక్కనే ఉన్న అనంతారం చెరువులోకి వెళ్లేది. దీంతో భూగర్భ జలాలు పుష్కలంగా ఉండేవి. ఫలితంగా పెద్దలింగాపూర్ రైతులు వేలాది ఎకరాల్లో వరి పంటలు వేసి మోటార్ల ద్వారా పారించుకునేది. ప్రస్తుతం కాళేశ్వరం ద్వారా నీళ్లు ఎత్తిపోయక పోగా మధ్యమానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్కు నీళ్లు ఇవ్వడం లేదు. దీంతో అన్నపూర్ణ రిజర్వాయర్ వట్టిపోయే పరిస్థితి రాగా, అనంతారం చెరువు ఎండిపోయి భూగర్భజలాలు అడుగంటిపోయాయి. పెద్దలింగాపూర్ గ్రామంలోని చేతికొచ్చే దశలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఎండి పంటలను చూడలేక సోమవారం రైతులు వరి పొలానికి నిప్పు పెట్టారు. నెల రోజులు గా నీళ్లివ్వాలని రోడ్డెక్కుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదని రైతులు మండిపడుతున్నారు. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సిరికొండ, పెద్దలింగాపూర్ తదితర గ్రామాల్లో ఎండిపోతున్న పంటలను పరిశీలించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని వాపోతున్నారు.
పుట్టెడు దుక్కం వస్తాంది
పోయినసారి లెక్కనే ఈ సారి కూడా నీళ్లత్తయని నాలుగెకరాలు ఏసిన. తొమ్మిదేండ్ల సంది ఏ రందీ లేకుండా వరి సాగు చేసుకున్నం. కానీ, ఈ యాసంగిల నీటికి గోసయితంది. ఇంకో పదిహేను రోజులైతే పంట కోతకు వచ్చేది. ఇప్పుడు బాయికాడికి పోతే పంటను చూసి పుట్టెడు దుక్కం వస్తాంది. ఏం చేసినా పొలం పారే పరిస్థితి లేదు. లాగోడి మీద పడి అప్పుల పాలవుడే. ఇప్పటి వరకు పంటలను ఎవరూ పరిశీలించలె. ఎమ్మెల్యే కన్నెత్తి చూడలె. కాంగ్రెస్ సర్కారు ఆదుకోవాలి.
– గుర్రాల బుచ్చవ్వ, పెద్దలింగాపూర్,