పోటీ పరీక్షలన్నింటికీ పాత సిలబస్సే
కరెంట్ అఫైర్స్, జీకేలోనే మార్పులు
ఉద్యోగాల భర్తీపై అధికారుల వివరణ
హైదరాబాద్, మార్చి 12 : త్వరలోనే రాష్ట్రప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్న నేపథ్యంలో కొంతమంది సిలబస్ మార్పుపై వ్యక్తంచేస్తున్న ఆందోళనను అధికార వర్గాలు కొట్టిపారేశాయి. ఏ పరీక్షకూ సిలబస్ మారే అవకాశంలేదని తెలిపాయి. పోటీ పరీక్షలన్నింటికీ పాత సిలబస్నే కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు. కరెంట్ అఫైర్స్, జీకే, వర్తమాన అంశాలు మాత్రమే అదనంగా చేరుతాయని, అవన్నీ సిలబస్లో భాగంగా ఉన్నవేనని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని 27 శాఖల్లో 80,039 ఖాళీల భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నది.
టీఎస్పీఎస్సీతోపాటు వివిధ విభాగాల రిక్రూట్మెంట్ బోర్డులు, ఏజెన్సీల ద్వారా వీటిని భర్తీ చేస్తారు. ఈ నేపథ్యంలో పరీక్షలకు పాత సిలబస్ ఉంటుందా? కొత్త సిలబస్ రూపొందిస్తారా? అన్న సందేహాలు పలువురు అభ్యర్ధులు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీఎస్పీఎస్సీ ఇప్పటికే స్పష్టతనిచ్చింది. పాత సిలబసే కొన సాగుతుందని కమిషన్ చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్రెడ్డి ప్రకటించారు. పోలీస్, గురుకులాల రిక్రూట్మెంట్ బోర్డులు సైతం ఇదే ఆలోచన చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం సిలబస్ను మార్చాలంటే మూడేండ్ల ముందుగానే నోటిఫికేషన్ ఇవ్వాలి. త్వరలోనే నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో సిలబస్లో మార్పులు ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు. అయా టాపిక్లలో వర్తమాన అంశాలపై ప్రశ్నలు ఉంటాయని చెప్తున్నారు. ఉదాహరణకు గ్రూప్స్లో ఎకనామిక్స్ సబ్జెక్ట్పై అత్యధిక ప్రశ్నలు వస్తాయి. సిలబస్లో భాగంగా బడ్జెట్, ఆర్థిక సర్వే, జీడీపీ, ద్రవ్యోల్బణం, జీఎస్టీ, నీతి ఆయోగ్, తలసరి ఆదాయం తదితర అంశాల్లో తాజా మార్పులు, గణాంకాలపై ప్రశ్నలు అడుగుతారని అధికారులు వివరించారు.