హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 15 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా చమురు మసులుతున్నది. నిన్నటి దాకా వరుసగా ధరలు పెంచి జనం నడ్డి విరిచిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త కొర్రీలతో గందరగోళాన్ని సృష్టిస్తున్నది. పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలే భరించాలని చెప్తున్నది. దీంతో చమురు మార్కెటింగ్ సంస్థలు డిమాండుకు అనుగుణంగా డీలర్లకు పెట్రోల్, డీజిల్ను సరఫరా చేయడం లేదు.
ఫలితంగా పలు రాష్ర్టాల్లో మాదిరిగా తెలంగాణలోని పెట్రోల్ బంకుల ముందు తరచుగా ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ సమస్య పెద్దగా లేకపోయినప్పటికీ జిల్లాల పరిధిలో మాత్రం జఠిలంగా మారుతున్నట్టు కనిపిస్తున్నది.
ప్రస్తుతం రోజువారీ అవసరాలకు సరిపోయేంత ఇంధనం సరఫరా కావడంలేదని, దీనికి తోడు ఇప్పుడు వ్యవసాయ సీజన్ కూడా ప్రారంభం కావడంతో డీజిల్ కొరత మరింత తీవ్రమయ్యే అవకాశమున్నదని పెట్రోల్ బంక్ యజమానులు స్పష్టం చేస్తున్నారు. ఇదంతా చమురు మార్కెటింగ్ సృష్టిస్తున్న కృత్రిమ కొరతేనని ధ్వజమెత్తుతున్నారు. మరోవైపు స్టాక్ మార్కెట్లో ప్రముఖ చమురు సంస్థల షేర్ల విలువ నానాటికీ పతనమవుతుండటం చర్చకు దారి తీస్తున్నది.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఇంధన ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. 2014లో దాదాపు రూ.80గా ఉన్న లీటరు పెట్రోలు ధర గత 8 ఏండ్లలోనే రూ.50 పెరిగి ఇటీవల రూ.120 వద్దకు చేరింది. ఇదే సమయంలో డీజిల్ ధర సైతం రూ.62.45 నుంచి రూ.104కు పెరిగింది.
రాష్ర్టాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు స్థిరంగా కొనసాగుతున్న ఇంధన ధరలు.. ఆ ఎన్నికలు ముగియగానే ఎడా పెడా పెరగడం సామాన్య జనానికి గుదిబండలా మారింది. దీంతో గత నెల 21న పెట్రోలుపై రూ.8.62, డీజిల్పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంధన ధరల్ని కొండంత పెంచిన బీజేపీ సర్కారు.. కేవలం గోరంత తగ్గించి చేతులు దులుపుకొన్నది. ఈ కంటితుడుపు తగ్గింపు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ప్రస్తుతం గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.
చమురు సంస్థల తీరుతో డీలర్లు విస్మయం చెందుతున్నారు. ఎంత తక్కువ ఇంధనం అమ్మితే తమకు అంత మేర నష్టాలు తగ్గుతాయని చమురు అవుట్లెట్ల నిర్వాహకులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ డీలర్లు ఇటీవల ‘నో పర్చేజ్’ డే నిర్వహించారు. ఇంధన కొనుగోళ్లు నిలిపివేసి మల్లాపూర్లోని చమురు సంస్థల డిపోల ముందు నిరసన వ్యక్తం చేశారు.
దీని ద్వారా తమకు కోట్ల రూపాయల ఆదా అయిందని నిర్వాహకులు చెప్పడం గమనార్హం. క్రూడ్ ఆయిల్ కొనుగోలు ధర, దానిని శుద్ధి చేశాక అమ్మే ధరను బేరీజు వేస్తే చమురు మార్కెటింగ్ సంస్థలకు నష్టాలు వస్తున్నాయని, అందుకే విరివిగా స్టాక్ ఇచ్చేందుకు వెనుకాడుతున్నాయని డీలర్లు చెప్తున్నారు. ఈ నష్టాలను దృష్టిలో పెట్టుకొని చమురు శుద్ధిని నిలిపివేస్తే మరింత నష్టం వస్తుందన్న భయంతోనే డీలర్లకు చమురు సంస్థలు స్టాక్ ఇస్తున్నట్టు తెలుస్తున్నది.
స్టాక్ మార్కెట్లో ప్రతికూల పరిస్థితులకు తోడు కేంద్ర వైఖరితో చమురు సంస్థల షేర్ల విలువ నానాటికీ గణనీయంగా పడిపోతున్నట్టు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో రూ.310గా ఉన్న హెచ్పీసీఎల్ షేర్ విలువ.. ఇప్పుడు రూ.214కు పతనమైంది.
ఇదేవిధంగా ఐవోసీఎల్ షేర్ విలువ రూ.134 నుంచి రూ.109కు, బీపీసీఎల్ షేర్ విలువ రూ.336 నుంచి రూ.313కు దిగజారింది. చమురు సరఫరా రంగంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు ఆగస్టు వరకు కొనసాగవచ్చని, దీంతో చమురు మార్కెటింగ్ సంస్థల షేర్ల విలువ మరింత తగ్గే అవకాశం ఉన్నదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఆ భారాన్ని చమురు సంస్థలే భరించాలన్న నరేంద్రమోదీ సర్కారు నిర్ణయంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు పెట్రోల్ బంక్ డీలర్ల పట్ల ఆర్థిక అంశాల్లో ఉదాసీనంగా వ్యవహరించిన చమురు మార్కెటింగ్ సంస్థలు ఇప్పుడు ఒక్కసారిగా కొర్రీలు పెట్టడం మొదలుపెట్టాయి.