హైదరాబాద్ : వానాకాలంలో ఏ పంట వేసుకోవాలనేది రైతుల ఇష్టమని, ఎలాంటి ఆంక్షలు ఉండవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు స్వార్థపరులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి విమర్శించారు. కొందరు రైతులు మాత్రం ప్రభుత్వ సూచనలను అర్థం చేసుకుని ఇతర పంటల సాగు చేస్తున్నారని పేర్కొన్నారు.
రైతు పంటతో మార్కెట్కు వెళ్లకుండా, కల్లం వద్దకే మార్కెట్ వెళ్లాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వరిసాగుపై చేసే సూచనలు ఆంక్షలు కాదని, లాభసాటి పంటలు వేయాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. బియ్యం కాకుండా వడ్లు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు. కొందరు కురచబుద్దితో తెలంగాణ విజయాలను మరుగున పడేయాలని చూస్తున్నారని, అలాంటి వారు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలని నిరంజన్ రెడ్డి సూచించారు.