రాష్ట్ర ప్రగతిలో కేంద్రం పాత్ర సున్నా
కాదని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా
మీడియా చిట్చాట్లో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూలై 15(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీలలాగా తాము ప్రభుత్వాలను కూల్చలేదని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఇతర పార్టీల నేతలు స్వయంగా వస్తేనే టీఆర్ఎస్లో చేర్చుకొన్నామని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే 2023లోనే జరుగుతాయని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని పునరుద్ఘాటించారు. హక్కుగా రావాల్సిన వాటికంటే ఎక్కువ నిధులు ఇచ్చినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. సిరిసిల్లకు వస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ, అక్కడే రెండురోజులు ఉండి అభివృద్ధి అంటే ఏమిటో నేర్చుకొని పోవాలని సూచించారు. కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
ముక్కు నేలకు రాస్తా..
దేశానికి తెలంగాణ ఇచ్చింది ఎక్కువ.. కేంద్రం మనకు ఇచ్చింది తక్కువ. మనం రూపాయి ఇస్తే.. కేంద్రం 46 పైసలు ఇచ్చింది. ఈ దేశ నిర్మాణంలో, ఇతర రాష్ట్రాల అభివృద్దిలో తెలంగాణ పాత్ర ఉన్నది తప్ప.. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర సున్నా. ఇది తప్పని ఎవరైనా రుజువు చేస్తే నేను ముక్కు నేలకు రాస్తా. మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. కేంద్రంతో మాకు వ్యక్తిగతంగా ఎలాంటి పంచాయితీ లేదు. ఇవ్వనిది ఇచ్చినట్టు ప్రచారం చేస్తుంటే ఖండించడం తప్పా? హైదరాబాద్లో రూ.1,500 కోట్లతో ఫ్లైఓవర్లు కట్టానని ప్రధాని అన్నారు. అవి ఎక్కడున్నాయో నాకైతే కనిపించలేదు. ఎవరికీ కనపడని ఫ్లై ఓవర్లు కడుతున్నందుకు మోదీకి ధన్యవాదాలు. తెలంగాణలో ఒక టెక్స్టైల్ పార్క్ అన్నారు. దేశంలో ఎవ్వరూ పెట్టకముందే తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్కు పెట్టి ఆదర్శంగా నిలబడితే సపోర్ట్ ఇవ్వరు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్ పెడితే సపోర్ట్ చేయరు. ఇండస్ట్రియల్ కారిడార్కు సపోర్ట్ లేదు. అలాంటప్పుడు ఎన్ని రోజులు ఊరుకుంటం. రాహుల్గాంధీ పుణ్యమా అని దేశంలో మొత్తం కాంగ్రెస్ సచ్చిపోయింది. కాబట్టి అపోజిషన్లో ఎవరో ఒకరు ఉండాలి.
మేం అధికారాన్ని డిస్టర్బ్ చేయలేదు
ఇతర పార్టీ ప్రజాప్రతినిధులు మాకు అవసరం లేదు. ఆ రోజు వాళ్లను మేం తీసుకోకపోతే బీజేపీలోకో, ఇంకో పార్టీలోకో పోయేవాళ్లు. వాళ్లు రావడం వల్లే మా ప్రభుత్వం నిలబడే పరిస్థితో, రాకపోతే కింద మీద అయ్యే పరిస్థితో లేదు. ఎన్నికల్లో మాకు మూడొంతుల మెజారిటీ వచ్చింది. కానీ పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉన్నదని భావించాం కాబట్టి చేర్చుకొన్నాం. బీజేపీ వాళ్ల మాదిరిగా బల ప్రయోగం చేసి, హోటళ్లల్లో పెట్టి, పోలీసులను కాపలా పెట్టి, ప్రజలు అసహ్యించుకునేలా చేయలేదు కదా? ఇదే పనిని కాంగ్రెస్ పార్టీ చేసింది. అవసరం లేకపోయినా రాజస్థాన్లో బీఎస్పీని విలీనం చేసుకొన్నది. బీజేపీ మాత్రం ఏకంగా ప్రభుత్వాలను పడగొట్టింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అందుకు ఉదాహరణ.
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు
అసెంబ్లీ ఎన్నికలు పక్కా షెడ్యూల్ ప్రకారమే 2023లో జరుగుతాయి. ముందస్తుకు పోవాల్సిన అవసరం మాకు లేదు. ఎన్నికల కమిషన్ ఎవరి చెప్పుచేతుల్లో ఉన్నదో, ఏ విధంగా తేదీలు డిక్లేర్ అవుతున్నాయో అందరికీ తెలుసు. కాబట్టే ముందస్తు ఎన్నికలపై వాళ్లు తేదీలు ప్రకటిస్తే దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని, అసెంబ్లీని రద్దుచేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఓవైపు రాష్ట్రం వరదలతో సతమతం అవుతుంటే ప్రధానిగానీ, కేంద్రం గానీ మానవతా దృక్పథంతో అడ్వాన్స్ రిలీఫ్ ఇవ్వాలి. ప్రజలకు సహాయం చేయడానికి నిధులు ఇస్తారు. కానీ తెలంగాణకు మాత్రం సాయం చేయరు. ప్రధాని రాకపోయినా ఫర్వాలేదు, డబ్బులు ఇస్తే చాలు. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు జరిగిన నష్టం గురించి లెక్కలు పంపించాం. ఇప్పటి వరకు అదనంగా రూపాయి ఇవ్వలేదు. గుజరాత్కు అడ్వాన్స్ రిలీఫ్ కింద రూ.వెయి కోట్లు ఇస్తారు.. తెలంగాణకు ఎందుకు ఇవ్వరు?