హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): పోలీసుల అనుమతి లేకుండానే తాము ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహిస్తున్నట్టు బీజేపీ హైకోర్టులో ఒప్పుకొన్నది. దీంతో పోలీసుల అనుమతి లేకుండా భారీ జనంతో కూడిన యాత్రను ఎలా అనుమతిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అనుమతిలేని యాత్రపై తాము స్పందించబోమని స్పష్టంచేసింది. ప్రజా సంగ్రామ యాత్రను పోలీసులు నిలిపివేయడాన్ని వ్యతిరేకిస్తూ.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి దాఖలు చేసిన రిట్ పిటిషన్పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ప్రజల కోసమే బండి సంజయ్ యాత్ర చేస్తున్నారని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది ఎన్ రామచందర్రావు పేర్కొనగా.. ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించేందుకు అధికారుల నుంచి అనుమతి తీసుకొన్నారా? అని న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత కీలక ప్రశ్న సంధించారు. దీనిపై రామచందర్రావు స్పందిస్తూ.. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి కోరుతూ.. బీజేపీ తరఫున జూలై 23న డీజీపీకి వినతిపత్రం ఇచ్చామని చెప్పారు.
పోలీసుల నుంచి యాత్రకు రాతపూర్వకంగా అనుమతి లేదని, డీజీపీ మౌఖికంగా అనుమతి ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా హోంశాఖ తరఫు న్యాయవాది శ్రీకాంత్రెడ్డి కల్పించుకొంటూ.. బండి సంజయ్ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా.. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగిస్తున్నారని, పలు పోలీస్స్టేషన్లలో ఆయనపై 15 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రెచ్చగొట్టే ప్రసంగాలకు సంబంధించిన మూడు వీడియోలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇదేవిధంగా యాత్రను కొనసాగిస్తే శాంతిభద్రతల సమస్య తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల అనుమతి లేకుండా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడే విధంగా యాత్ర నిర్వహించడం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. అనుమతి లేని ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహించడానికి వీల్లేదని, పిటిషన్ను కొట్టేయాలని కోరారు. బండి సంజయ్ ప్రసంగాలను పోలీసులు అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే ప్రజా సంగ్రామ యాత్రను వర్ధన్నపేట ఏసీపీ నిలిపివేశారని, ఇదే విషయాన్ని ఆయనకు 23న లిఖితపూర్వంగా కూడా తెలియజేశారని వివరించారు. వాదనల అనంతరం హైకోర్టు.. బండి సంజయ్పై పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలు, రెచ్చగొట్టే ప్రసంగాల వీడియోలను తమకు నివేదించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.