సూర్యాపేట, జూన్ 15 (నమస్తే తెలంగాణ): అసమర్థుల మాటలు ఎవరూ వినరని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. పాలనపై నియంత్రణ కోల్పోయారనడానికి సీఎం రేవంత్రెడ్డి మాటలే నిదర్శనమని చెప్పారు. సోమవారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి సర్ ప్రక్రియ, బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. నాడు కేసీఆర్ ఏదైనా సమస్య ఉంటే అధికారులతో రోజుల తరబడి సమీక్షలు ని ర్వహించేవారని గుర్తుచేశారు. నేడు ముఖ్యమంత్రి ఏఏ డిపార్ట్మెంట్ నుంచి ఏం వస్తాయి అని అధికారులను అడిగి తెలుసుకునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవాచేశారు.
ఎడారిని తలపించిన తుంగతుర్తి ప్రాంతానికి కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరంతో గోదావరి నీళ్లు వచ్చి సస్యశ్యామలం చేసి పసిడి సిరు లు పండించామని చెప్పారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మూ డు యాసంగి సీజన్లుగా నీళ్లు ఇవ్వకుండా రైతులను అరిగోస పెట్టిందని దుయ్యబట్టారు. సీఎం సీటుపై కూర్చొని తన మాట ఎవ్వడు లెక్క చేయడం లేదు అనడం సిగ్గుగా అనిపిస్తలేదా అని ప్రశ్నించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హెలికాప్టర్ మంత్రులుగా పేరు గడించిన ఇద్దరు మంత్రులు ఒకరికొకరు అసమర్థత, అవగాహనలేమిలో పోటీ పడుతున్నారని అన్నారు. సమావేశంలో సభ్యత్వాల జిల్లా ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ మాజీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగేందర్రావు ఉన్నారు.