హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : సినిమా థియేటర్లకు ఉదయం 11 గంటల్లోపు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏండ్లలోపు పిల్లలను సినిమాలకు అనుమతించొద్దని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై తగి న నిర్ణయం తీసుకోవాలని హోం శాఖకు సూచించింది. అన్ని వర్గాలతో ప్రభుత్వం చర్చలు జరిపి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. గేమ్చేంజర్ సినిమా టికెట్ ధరల పెంపును, అదనపు షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి పైవిధంగా ఉత్తర్వులు జారీచేశారు. పిటిషనర్ తరఫు న్యా యవాది విజయ్ గోపాల్ వాదిస్తూ, ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతించరాదని 11న ఉత్తర్వులిచ్చిందని చెప్పారు.
సినిమాటోగ్రఫీ రూల్స్ ప్రకారం ఉదయం 8.40లోపు, తెల్లవారు జామున 1.30 తర్వాత సినిమాలను ప్రదర్శించరాదని తెలిపారు. మల్టీప్లెక్స్ల్లో ఆఖరాట అర్ధరాత్రి 1.30 గంటలకు ఉంటుందన్నారు. ఆ సమయంలో సినిమాకొచ్చే మైనర్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పుష్ప-2 ప్రదర్శన సమయం లో జరిగిన తొకిసలాటలో మహిళ మరణించిందని గుర్తు చేశారు. వాదనల తర్వాత హైకోర్టు, ప్రతివాదులైన హోం శాఖ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు నోటీసులు ఇచ్చింది. విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.