కోర్ కోర్సులు పూర్తిగా ఎత్తేయొద్దు
ఏఐసీటీఈ హ్యాండ్బుక్ విడుదల
హైదరాబాద్, మార్చి 29 : కొత్త ఇంజినీరింగ్ కాలేజీల ఏర్పాటుపై మరో రెండేండ్లు మారటోరియం విధిస్తున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తెలిపింది. 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు కొత్త ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇవ్వబోమని మంగళవారం అధికారికంగా ప్రకటించింది. బీవీఆర్ మోహన్రెడ్డి కమిటీ సిఫారసులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నది. 2022-23 విద్యా సంవత్సరానికి అప్రూవల్ హ్యాండ్బుక్ను ఏఐసీటీఈ మంగళవారం విడుదల చేసింది. ప్రస్తుతం నడుస్తున్న కాలేజీలు కొత్త కోర్సులు ప్రారంభించేందుకు ఏఐసీటీఈ అనుమతుల కోసం ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించింది.
కాలేజీలను, బ్రాంచీలను మూసివేయదల్చుకున్న యాజమాన్యాలు ఏప్రిల్ 29లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి కోర్ కోర్సులను పూర్తిగా మూసివేయడం కుదరదని, సగం సీట్లు తగ్గించుకొని నిర్వహించాలని స్పష్టం చేసింది. తగ్గించుకొన్న 50 శాతం సీట్లతో కొత్త కోర్సు ప్రారంభానికి అనుమతి పొందవచ్చునని సూచించింది. ఇంజినీరింగ్ కోర్సుల్లో ఈ ఏడాది నుంచి మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్ విధానానికి అవకాశం కల్పిస్తున్నట్టు ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుద్ధే వెల్లడించారు. దీంతో విద్యార్థి ఒక కోర్సును మధ్యలోనే మానేసి మరో కోర్సులో చేరవచ్చు. దీని ప్రకారం ఒక కోర్సును ఒక సంవత్సరం పూర్తి చేస్తే సర్టిఫికెట్, రెండేండ్లు పూర్తిచేస్తే డిప్లొమా, మూడేండ్లకు డిగ్రీ, నాలుగేండ్లు పూర్తి చేస్తే అనర్స్ డిగ్రీని ఇస్తారు.
ఈడబ్ల్యూఎస్ కోటాకు సూపర్న్యూమరీ సీట్లు
ఈడబ్ల్యూఎస్లో కోటా ప్రకారం ఇంజినీరింగ్ సీట్లను సూపర్న్యూమరీ కోటాలో 10 శాతం చొప్పున పెంచుతున్నట్టు ఏఐసీటీఈ ప్రకటించింది. కొత్తగా సర్దుబాటు చేసిన కోటా ప్రకారం వివిధ క్యాటగిరీలకు కేటాయించే సీట్లు 100 నుంచి 125 శాతానికి పెరుగుతాయి. ఆయా సీట్ల పెంపు వివరాలను సైతం ఏఐసీటీఈ అప్రూవ్డ్ హ్యాండ్బుక్లో వెల్లడించింది.