రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఔషధాల కొరత వేధిస్తున్నది. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పంపిణీదారులు మందుల సరఫరాను నిలిపివేసినట్టు చెప్తున్నారు. దీంతో మందులు సరైన మోతాదులో దొరకని పరిస్థితి నెలకొన్నదని వైద్యులు వాపోతున్నారు. ఇందులో సాధారణ ఔషధాల నుంచి విలువైన, ప్రాణాధార ఔషధాలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు.
Telangana | హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): సాధారణంగా వైద్యారోగ్య శాఖ టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారా డిస్ట్రిబ్యూటర్లు, సప్లయర్ల నుంచి ఔషధాలను కొనుగోలు చేస్తుంది. ఈఎస్ఐ దవాఖానలు, డిస్పెన్సరీలకు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి సరఫరా చేస్తుంది. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ వంటి ప్రధాన దవాఖానలు కొన్ని మందులను నేరుగా కొనుగోలు చేస్తుంటాయి. నిర్ణీత గడువుతో చెల్లింపులు చేస్తుంటాయి.
టీఎస్ఎంఎస్ఐడీసీ, ఈఎస్ఐ, హైదరాబాద్లోని ప్రధాన దవాఖానల నుంచి తమకు సుమారు రూ.400 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నదని ‘ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్’ సభ్యులే స్వయంగా తెలిపారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో మందుల సరఫరా నిలిపివేసినట్టు చెప్పారు. ఈఎస్ఐ నుంచి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.280 కోట్ల నిధులు వచ్చాయని, వాటిని కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్ కూడా ఇవ్వడం లేదని, దీంతో కంపెనీలకు నగదు చెల్లించలేక చేతులెత్తేసినట్టు చెప్తున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రికి, వైద్యారోగ్యశాఖ మంత్రికి, ఇతర ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా చెల్లింపులు జరగడం లేదని వాపోయారు.
అడుగంటుతున్న నిల్వలు
సాధారణంగా ప్రభుత్వం మూడు నెలలకు సరిపడా మందులను నిల్వ ఉంచుతుంది. డిస్ట్రిబ్యూటర్లు సరఫరా నిలిపివేసినా.. గతంలో నిల్వ ఉంచిన ఔషధాలతో ఇప్పటివరకు నెట్టుకొస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నిల్వలు కూడా అడుగంటిపోతుండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ కావాలని అడిగితే వెంటనే మందులు రావడం లేదని వైద్యులు చెప్తున్నారు. నాలుగైదు రోజుల తర్వాత కొంత మేరే స్టాక్ వస్తున్నదని వాపోతున్నారు.
జ్వరం, జలుబు వంటి చిన్న వ్యాధులు, బీపీ, మధుమేహ రోగులకు ఇచ్చే నిరంతర ఔషధాలకు పెద్దగా ఇబ్బంది లేదని, దవాఖాన చికిత్సల్లో వాడే ప్రాణాధార మందులకు మాత్రం కొరత ఏర్పడిందని తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఒకటి రెండు వారాల్లో అన్నిరకాల మందులకు కొరత ఏర్పడటం ఖాయమని చెప్తున్నారు. మందుల కొరత విషయంపై టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులను వివరణ కోరగా.. నిల్వలకు ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఎన్నికల ప్రచారం, పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇప్పటికైనా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఇప్పటికైనా చొరవ తీసుకొని, సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఆర్డర్లే తప్ప చెల్లింపులు లేవు
మా సంస్థ ప్రధానంగా హిమోఫీలియా ఫ్యాక్టర్ 7,8,9ని ప్రభుత్వానికి సరఫరా చేస్తుంది. రూ.3.50 కోట్ల విలువైన మందులు సరఫరా చేయాలని ప్రభుత్వం నుంచి కొనుగోలు ఆర్డర్ వచ్చింది. అప్పటికే ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.4 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నది. అయినా బ్యాంకుల్లో, బయట అప్పులు చేసి మరీ కంపెనీల నుంచి కొనుగోలు చేసి మందులను సరఫరా చేశాం. ఇప్పటివరకు చేసిన కొనుగోళ్లకే మా దగ్గర నిధులు పూర్తిగా ఆవిరయ్యాయి. బ్యాంకుల నుంచి ఓవర్డ్రాఫ్ట్ కూడా తీసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో సరఫరా నిలిపివేయాల్సి వచ్చింది.
– పీ గిరీశ్ భట్, మెడిహాక్స్ ఫార్మాస్యూటికల్స్