హనుమకొండ, మే 31 : సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు రైతులకు అన్యాయం జరుగదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (కుడా) అధ్వర్యంలో జరప తలపెట్టిన ల్యాండ్ పూలింగ్ని ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. రైతుల కోరిక మేరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం రద్దు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
ఈ మేరకు వరంగల్ ‘కుడా’ ల్యాండ్ పూలింగ్ పై హనుమకొండలోని మంత్రి కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి ఎర్రబెల్లి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ అమలులో ఉంది. ఇదే తరహాలో ‘కుడా’ లో కూడా భవిష్యత్ అవసరాలు, అభివృద్ధి కోసం రైతాంగానికి నష్టం కలగకుండా వారి ఆమోదంతో ల్యాండ్ పూలింగ్ చేయాలని గతంలో నిర్ణయించామన్నారు.
ఈ మేరకు వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల పరిధిలోని 28 గ్రామాల్లో సర్వే నిర్వహించాలన్న విషయాన్ని గుర్తు చేశారు. రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి వీలుగా ఫారం -1 తో నోటిఫికేషన్ ను 30-04-2022న వెలువరించాం. అయితే, రైతులు తమ సాగు భూములను ఇవ్వడానికి సిద్ధంగా లేరని తెలిసిందన్నారు.
రైతుల కోరిక మేరకు చాలా రోజుల క్రితమే ల్యాండ్ పూలింగ్ ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించామన్నారు. మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉండటంతో కొంత ఆలస్యం జరిగిందని ఆయన తెలిపారు. మంత్రి కేటీఆర్ తిరిగి వచ్చాక తనతో చర్చించి ల్యాండ్ పూలింగ్ను రద్దు చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
ఇదిలా ఉండగా కొన్ని రాజకీయ పార్టీలు, భూ మాఫియా, స్వార్థ శక్తులు తమ సొంత లాభానికి, రైతులను వంచించి, మోసం చేయడానికి పూనుకున్నారని విమర్శించారు. అలాంటి వాళ్ల మాయలో పడొద్దని, రైతులు తమ భూములను వాళ్ల మాయ మాటలకు అమ్ముకోవద్దని మంత్రి సూచించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ టి రాజయ్య, ఆరూరి రమేశ్, కుడా చైర్మన్ సుందర్ రాజ్, కలెక్టర్లు గోపి, రాజీవ్ గాంధీ హనుమంతు, కుడా వైస్ చైర్మన్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.