హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల ఆశలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి నీళ్లు చల్లింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 2031 దాకా పెంచేది లేదని స్పష్టంచేసింది. నియోజకవర్గాల పునర్విభజనను 2026 జనాభా లెక్కల అనంతరమే చేపడతామని వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం లోక్సభలో ఎంపీ రేవంత్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్రాయ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాల సంఖ్యను 175కు, ఏపీలో ఉన్న 153 సీట్లను 225కు పెంచాల్సి ఉన్నది. ఇరు రాష్ర్టాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకున్నదా? నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తవుతుంది? జమ్ము కశ్మీర్లో మాదిరిగా తెలుగు రాష్ర్టాల్లో ప్రక్రియ కొనసాగుతుందా? అని సభ్యుడు ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ నియోజకవర్గాల పునర్విభజనను రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026 జనాభా లెక్కల ప్రాతిపదిక చేపడతామని తేల్చి చెప్పారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను ఎందుకు పెంచరని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చిన్న సవరణ చేస్తే సరిపోయే అంశంపై ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నదో అర్ధం కావడం లేదని మంగళవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. విభజన చట్టంలోని సెక్షన్ 26లో ‘సబ్జెక్టు’ అనే పదాన్ని తొలగించి, ‘నాట్ విత్ స్టాండింగ్’ అనే పదం చేర్చి, చట్ట సవరణ చేయడం ద్వారా అసెంబ్లీ స్థానాలను పెంచే అవకాశం ఉన్నదని వివరించారు. సీట్ల పెంపు విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. విభజనచట్టంలో సవరణలు చేసి, ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం, శాసనమండలి సీట్లను పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. అదేపద్ధతిలో అసెంబ్లీ సీట్లను ఎందుకు పెంచరని ప్రశ్నించారు. తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను తక్షణమే పెంచాలని, విభజన చట్టంలో సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సీట్ల పెంపు కోసం తాను పార్లమెంట్లో ప్రైవేట్బిల్లు పెట్టానని గుర్తుచేశారు. ఎంపీ కేశవరావుతో కలిసి అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో సమావేశమైన సందర్భంలో న్యాయశాఖ అధికారులు సీట్ల పెంపు సాధ్యమేనని చెప్పినట్టు వినోద్కుమార్ పేర్కొన్నారు.
వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే చర్యలకు ప్రోత్సాహం అందిస్తున్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పేర్కొన్నారు. మంగళవారం లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వక సమాధానం చెప్పారు. వ్యవసాయాభివృద్ధి రేటును పెంచడానికి, వ్యవసాయరంగంలో మూలధనం పెంపుదల కోసం కేంద్రం ప్రతిపాదించిన చర్యలను వివరించాలని నామా కోరారు.