వన్యప్రాణి సంరక్షణ మండలిలో ఇంద్రకరణ్రెడ్డి
హైదరాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ): వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల విషయంలో అటవీ ప్రాంతానికి వీలైనంత తక్కువ నష్టం జరిగేలా ప్రతిపాదనలు రూపొందించినట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి, రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలి ఉపాధ్యక్షుడు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, ములుగు, నాగర్కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ తదితర జిల్లాల్లో చేపట్టిన రోడ్ల విస్తరణ, విద్యుత్తు ఆధునికీకరణ, టీ ఫైబర్ గ్రిడ్ తదితర 30 అభివృద్ధి పనులకు సంబంధించి అటవీశాఖ ఇవ్వాల్సిన అనుమతులపై బుధవారం అరణ్యభవన్లో నిర్వహించిన వన్యప్రాణి సంరక్షణ మండలి సమావేశంలో చర్చించారు. సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర ముఖ్య అటవీ సంరక్షణాధికారి (పీసీసీఎఫ్) ఆర్ఎం డోబ్రియాల్ తదితరులు పాల్గొన్నారు.