హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమంతట తామే పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, వాటర్ బాటి ళ్లు, స్నాక్స్, ఆహార పదార్థాలను అనుమతించేది లేదని చెప్పింది. పోలింగ్ స్టేషన్ నుంచి 100 మీటర్ల పరిధిలో కార్డ్లెస్ ఫోన్లు, వైర్లెస్ సెట్లు, స్పై కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ ల వినియోగాన్ని నిషేధిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీచేసింది. ప్రతి అభ్యర్థి తన పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఒక్కో ఏజెంట్, రిలీవర్ ఏజెంట్ను నియమించుకోవచ్చు. మాక్ పోలింగ్ నుంచి ఈవీఎంలను సీజ్ చేసే వరకు ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల్లో ఉండొచ్చు. పోలింగ్ ఏజెంట్కు ఓట రు గుర్తింపు లేదా మరేదైనా ఇతర గుర్తింపు కార్డు ఉండాలి. కేంద్రంలో ఏజెంట్లను జాతీ య, ప్రాంతీయ, రిజిస్టర్డ్ పార్టీలవారీగా ప్రాధాన్య క్రమంలో కూర్చోబెడతారు.
ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రభుత్వం నుంచి భద్రత పొందుతున్నవారు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించేందుకు వీల్లేదు. ఓటు వేసేందుకు వచ్చేవారిని ఏజెంట్లు అడ్డుకోకూడదు. ఓటర్లలో ఎవరైనా అప్పటికే ఓటు వేసినట్టు ఏజెంట్కు అనుమానం ఉంటే ప్రిసైడింగ్ అధికారికి మాత్రమే అభ్యంతరాన్ని తెలపాలి. పోలింగ్ రోజున అభ్యర్థులుగానీ లేదా వారి ఏజెంట్లుగానీ కేంద్రానికి 100 మీటర్ల లోపల ఎన్నికల ప్రచారం చేయకూడదు. ఏజెంట్లు తమ అభ్యర్థి పేర్లను, గుర్తులను, ఫోటోలను, పార్టీ జెండాలను పోలింగ్ స్టేషన్కు 100 మీటర్ల లోపల ధరించకూడదు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ముందు జరిపే తనిఖీలకు ఏజెంట్లతోపాటు ఓటర్లు విధిగా సహకరించాలి.
పోలింగ్ సమయంలో ఓటరు ఎడమ చేతి చూపుడు వేలుకు నిలువుగా ఇంకు పెడుతారు. ఒక వేళ ఓటరుకు చూపుడు వేలు లేకుంటే మరో వేలికి, ఆసలు ఎడమ చేయి లేకుంటే కుడి చేతి చూపుడు వేలుకు ఇంకు పెట్టవచ్చని ఎన్నికల సంఘం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. దీని ద్వారా ఆ వ్యక్తి ఓటు హక్కు వినియోగించుకున్నట్టు గుర్తిస్తారు. తద్వారా ఆ వ్యక్తి మరోసారి ఓటు వేయకుండా అడ్డుకోవచ్చు.