హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీలో ప్రభుత్వం పెట్టిన చిచ్చు చల్లారడం లేదు. ఆర్టీసీ సమ్మె చర్చల్లోనూ, ముఖ్యమంత్రితో మీటింగ్లోనూ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని కార్మిక సంఘాల నేతలు పట్టుబట్టినా.. ప్రభుత్వం మాత్రం తాత్సారం చేస్తూనే ఉన్నది. కార్మికుల్లో నెలకొన్న అసంతృప్తిని మరింత రగిలిస్తూ.. ఆర్టీసీ విలీన అంశాన్ని పక్కనపెట్టి గుర్తింపు సంఘం ఎన్నికలను భుజానికి ఎత్తుకున్నది. దీంతో విలీన ప్రక్రియపై తమకు రోజురోజుకూ ఆశలు సన్నగిల్లుతున్నాయని కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇప్పటికిప్పుడు సమ్మెకు పిలుపునిచ్చినా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు.
కార్మిక సంఘాల నేతలు పిలుపునిస్తే విలీనం కోసం జరిగే మలిదశ పోరాటంలో ముందుండి ప్రభుత్వంతో కొట్లాడుతామని అంటున్నారు. కాగా, తమకు గుర్తింపు సంఘం ఎన్నికలు వద్దంటూ.. విలీనమే చేపట్టాలంటూ ఇప్పటికే నిరసనలతో కొన్ని కార్మిక సంఘాలు హోరెత్తించాయి. నిరవధిక నిరసన దీక్షలు, డిమాండ్స్డేలు, డిపోల ఎదుట నిరసనలు చేపట్టి తమ ఆకాంక్షను తెలిపాయి. అయినా ప్రభుత్వం మొండివైఖరితో గుర్తింపు సంఘం ఎన్నికలకు మొగ్గు చూపుతున్నదని మండిపడుతున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల కారణంగా విలీన ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదని కొందరు కార్మిక నేతలు అంటున్నారు.
ఎన్నికల ప్రక్రియను పూర్తిగా నిలిపివేసి, ఇప్పటికే ఉన్న సంఘాలలో ఒకరొకరు చొప్పున విలీన కమిటీలో వేసి, తుది నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. కొన్ని యూనియన్లకు చెందిన అగ్రనాయకుల కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఎన్నికల అంశాన్ని ముందుకు తెచ్చిందని కార్మికులు అంటున్నారు. కొందరు నాయకులు వాళ్ల స్వార్థంతో వేలాదిమంది కార్మికుల పొట్ట కొడుతున్నారని , యాజమాన్యంతో కుమ్మక్కై బయటొకటి, లోపల ఒకటి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారివల్లే కార్మికులకు అన్యాయం జరుగుతున్నదని వాపోతున్నారు. కొన్ని యూనియన్ల నాయకుల కుట్రలను కార్మికులు పసిగట్టి తరిమికొట్టాల్సిన అవసరం వచ్చిందని కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు.
ఆర్టీసీలో తక్షణం ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టిన విషయమై తాము త్వరలోనే సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ కార్మిక జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ‘నమస్తే తెలంగాణ’తో తెలిపారు. ఎన్నికలు నిర్వహించే అంశంపై తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని చెప్పారు. ప్రభుత్వం పంపే ఉత్తర్వులనుబట్టే తమ ఆలోచన ఉంటుందని చెప్పారు. రిటర్నింగ్ అధికారిని నియమించారనే విషయంపై మాట్లాడుతూ.. కార్మిక సంఘాలకు లేబర్ కమిషన్ నుంచి లేఖలు వస్తేనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనదని భావిస్తామన్నారు. అయితే, తమ మొదటి ప్రాధాన్యం మాత్రం ఆర్టీసీ విలీనానికే ఉంటుందని స్పష్టం చేశారు. కొన్ని సంఘాల నాయకులతో ‘నమస్తే’ మాట్లాడగా.. జేఏసీ తీసుకునే నిర్ణయం ఆధారంగానే తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. మరికొన్ని సంఘాల నాయకులు ఇప్పటికిప్పుడు ఎన్నికల ప్రక్రియను నిలిపివేసి తక్షణ విలీన ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.