హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలను వేధిస్తున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావుకు వినతిపత్రం అందచేశారు.
సిరిసపల్లి గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వల్ల హుజూరాబాద్, చుట్టుపక్క ప్రాంతాలు కాలుష్యంతో నిండిపోతాయని, అక్కడి పంట పొలాలు, నీటి వనరులు, వాతావరణం తీవ్రంగా ప్రభావితమై స్థానికులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
విత్తనోత్పత్తికి అనుకూలమైన సమశీతోష్ణ వాతావరణం కలిగిన హుజూరాబాద్ ప్రాంతాన్ని ‘వేస్ట్ టు ఎనర్జీ’ పేరుతో కాలుష్య కేంద్రంగా మార్చడం అన్యాయమని పేర్కొంటూ.. డంపింగ్ యార్డు ఏర్పాటు ప్రతిపాదనను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. మానకొండూరు నియోజకవర్గంలోని కల్వల గ్రామంలో నిర్మించాల్సిన సాగునీటి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడ్డారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ నియోజకవర్గంలోని 6 వేల ఎకరాలకుపైగా వ్యవసాయ భూములకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని వివరించారు. తన నియోజకవర్గంలో రహదారుల నిర్మాణ పనులు ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ధి పనుల బిల్లులను వెంటనే విడుదల చేయాలని కౌశిక్రెడ్డి కోరారు.