హైదరాబాద్ : తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులపై శ్రీనివాస్ రావు ఇవాళ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జనవరి 28న థర్డ్ వేవ్ ఉధృతి ముగిసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి కొవిడ్ ఆంక్షలు లేవని చెప్పారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని స్పష్టం చేశారు. వారం రోజుల్లో వందలోపే కేసులు నమోదు అవుతాయన్నారు. టీకా తీసుకున్న వారిలో ప్రభావం తక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2 శాతం కంటే తక్కువగా ఉందని తెలిపారు. అత్యధిక పాజిటివిటీ రేటు 5 శాతానికి వెళ్లిందన్నారు. ఫీవర్ సర్వే ద్వారా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కిట్లు అందజేశారని చెప్పారు.
కొవిడ్ వల్ల రెండేండ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని శ్రీనివాస్ రావు తెలిపారు. ఐటీ సంస్థలు వర్క్ ఫ్రం హోం విరమించుకోవచ్చు అని సూచించారు. అన్ని సంస్థలు వంద శాతం పని చేయవచ్చు అని చెప్పారు. ఉద్యోగులు పూర్తి సంఖ్యలో కార్యాలయాలకు వెళ్లొచ్చు. విద్యాసంస్థలను పూర్తిగా ప్రారంభించామని తెలిపారు. ఆన్లైన్ తరగతులతో పిల్లల్లో మానసిక సమస్యలు రావొచ్చన్నారు. కేసులు తగ్గినా మాస్కులు ధరించాలని ఆదేశించారు. అందరూ కొవిడ్ టీకా తీసుకోవాలి అని డాక్టర్ శ్రీనివాస్ రావు సూచించారు.