హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి అపాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం నేపథ్యంలో యాత్రికుల భద్రతపై సోమవారం సాయంత్రం తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో టీటీడీ ఈవో, ఎస్పీ, అటవీశాఖ, జేసీ, ఇతర అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాల్లో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12 ఏండ్లలోపు వారిని తల్లిదండ్రులతో అనుమతిస్తామని పేర్కొన్నారు.
పెద్దలను మాత్రం రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తామని తెలిపారు. నడకదారి భక్తులకు ఊతకర్ర ఇవ్వాలని నిర్ణయించినట్టు వివరించారు. ఘాట్రోడ్లలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తామన్నారు. భక్తులను గుంపులుగా పంపుతామని, వీరికి సెక్యూరిటీ గార్డులు భద్రతగా ఉంటారని తెలిపారు. నడకదారుల్లో 500 కెమెరా ట్రాప్లు ఏర్పాటు చేశామని, అవసరమైతే డ్రోన్లను కూడా వినియోగిస్తామని వివరించారు. దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులు రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లవచ్చని తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా 30 అడుగుల దూరం కనిపించేలా ఫోకస్ లైట్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మెట్ల మార్గంలో కంచె ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, ఈ మేరకు అటవీశాఖకు ప్రతిపాదనలు పంపినట్టు వివరించారు.