హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటైన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో మొండిచేయి చూపిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాని స్థానంలో రైలు బోగీల సర్వీసింగ్ సెంటర్ నెలకొల్పుతామని తెలిపింది. కాజీపేటలో రెండు నెలల్లో పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (పీవోహెచ్) కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. టెండర్ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూమి ఇచ్చిన రాష్ట్రప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. పీవోహెచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిధులు కేటాయించామని, టెండర్ ప్రక్రియ మొదలైందని చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీ ఎం దుకు ఏర్పాటుచేయడం లేదన్న విషయమై వివరణ ఇవ్వని ఆయన.. కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సహకరించాలని చెప్పుకొచ్చారు.
రైళ్లు ఢీకొనడాన్ని నివారించే కవచ్
ఒకే ట్రాక్పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా.. ఒకదానినొకటి ఢీకొనకుండా అడ్డుకొనే ఆటోమెటిక్ రక్షణ వ్యవస్థ ‘కవచ్’ను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరీక్షించారు. వికారాబాద్ సెక్షన్లోని గొల్లగూడ చిట్టిగడ్డ రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం కవచ్ పనితీరును పరిశీలించారు. ఎదురెదురుగా వచ్చిన రైళ్లలో.. ఒకదానిలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రయాణించగా, మరో దానిలో రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో వినయ్కుమార్ త్రిపాఠి ప్రయాణించారు. ఈ రెండు రైళ్ల మధ్య 380 మీటర్ల దూరం ఉండగానే కవచ్ వ్యవస్థ ప్రమాదాన్ని పసిగట్టింది. ఆటోమెటిక్గా బ్రేకులు పడి రైళ్లు ఆగిపోయాయి.
ప్రపంచస్థాయి సాంకేతికతతో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘కవచ్’ రైల్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. న్యూఢిల్లీ-ముంబై, న్యూఢిల్లీ-హౌరా వంటి రద్దీ మార్గాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలోనే 2000 కిలోమీటర్లకు కవచ్ రక్షణ వ్యవస్థను విస్తరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4000 నుంచి 5000 కిలోమీటర్ల వరకు విస్తరించనున్నట్టు చెప్పారు. రైలు రెడ్ సిగ్నల్ దాటినా, ఎదురుగా ప్రమాదాన్ని పసిగట్టినా, పట్టాలు బాగాలేకపోయినా, సాంకేతిక లోపం తలెత్తినా కవచ్ వెంటనే గుర్తిస్తుంది. మలుపులు, లూపు లైన్లు దాటేటప్పుడు వేగాన్ని నియంత్రిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వాడి-వికారాబాద్-సనత్నగర్, వికారాబాద్-బీదర్ సెక్షన్ల మధ్య 25 స్టేషన్లను కవర్ చేస్తూ 264 కిలోమీటర్ల మేర కవచ్ను విస్తరించారు.